హైదరాబాద్ లోని చాంద్రాయణగుట్ట ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ పై కేసు నమోదు అయింది.ఈ మేరకు పలు సెక్షన్ల కింద సంతోష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
విధి నిర్వహణలో ఉన్న ఇన్ స్పెక్టర్ ను దుర్భాషలాడారని అక్బరుద్దీన్ ఒవైసీపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.అయితే లలితాబాగ్ లో మంగళవారం రాత్రి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా సమయం ముగియడంతో ప్రచారం ఆపాలని స్థానికంగా విధులు నిర్వహిస్తున్న ఎస్సై శివచంద్ర అక్బరుద్దీన్ ను కోరారు.
ఆ సమయంలో సదరు పోలీస్ అధికారిపై అక్బరుద్దీన్ ఆగ్రహం వ్యక్తం చేశారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే ఇంకా సమయం ఉందని, తాను మాట్లాడి తీరుతానని, తనను ఆపే వాళ్లు ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు.
అలాగు తనను ఆపే దమ్ము ఎవరికీ లేదని, ఒక్క సైగ చేస్తే అందరూ నిన్ను పరిగెత్తిస్తారంటూ ఎస్సైను ఉద్దేశించి అక్బరుద్దీన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.