నల్లగొండ జిల్లా: వేములపల్లి మండలంలో అంగన్వాడి కేంద్రాలకు సొంత భవనాలు లేక అద్దె భవనాల్లో నిర్వహిస్తుండగా,అరకొర వసతుల నడుమ పసి పిల్లలు,గర్భిణీ స్త్రీలు, బాలింతలు అవస్థలు పడుతున్నారు.మండల వ్యాప్తంగా 25 అంగన్వాడి కేంద్రాలు ఉండగా 7 శ్రీ భవన కేంద్రాల్లో,11 ప్రభుత్వ భవనాల్లో,7 అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
ఐదు సంవత్సరాల లోపు పిల్లలను బడి బాట పట్టిస్తూ,వారితో పాటు గర్భిణీలకు,బాలింతలకు పౌష్ఠికాహారం అందిస్తూ అమ్మవడిలా ఆదరించే అంగన్వాడి కేంద్రాల యొక్క ఆలనా పాలనా చూడాల్సిన ప్రభుత్వ యంత్రాంగం వాటిని గాలికొదిలేసింది.పక్కా భవనాలు ఉంటే అన్నిరకాల సదుపాయాలతో పిల్లలకు ఆట విడుపుగా ఉంటాయి.
కానీ,అద్దె భవనాల్లో అసౌకర్యాల నడుమ కాలం వెళ్లదీస్తున్నారు.
ఈ అద్దె భవనాలకు ప్రభుత్వం గ్రామాల్లో రూ.500 లే చెల్లించడంతో అన్ని వసతులు ఉన్న భవనాలు దొరకడం కష్టంగా మారి,శిధిలావస్థకు చేరుకున్నవి,నీటి వసతి, టాయిలెట్స్,విద్యుత్ సౌకర్యం లేనివే లభించడంతో పిల్లలతో పాటు అంగన్వాడి వర్కర్స్,ఆయాలు,సెంటర్ కు వచ్చే గర్భిణీలు, బాలింతలు అనేక రకాల ఇబ్బందులు పడుతున్నారు.ప్రభుత్వం అద్దె భవనాల్లో కొనసాగే అంగన్వాడి కేంద్రాలకు తక్షణమే సొంత భవనాలు నిర్మించి,పసి పిల్లలు పడుతున్న ఇబ్బందులకు తొలగించాలని పేరెంట్స్ కోరుతున్నారు.
ఆమనగల్లు,మొలకపట్నం, లక్ష్మీదేవిగూడెం,ఇటిక్యాల, శెట్టిపాలెం, మంగాపురం గ్రామాలలో అంగన్వాడీలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని ఐసిడీఎస్ సూపర్వైజర్ తెలిపారు.భవన నిర్మాణ కోసం ఎలాంటి నిధులు మంజూరు కాలేదని, సొంతభవనాలు లేకపోవడం వల్ల అద్దె భవనాల్లో కొనసాగిస్తున్నామని, సొంత భవనాలు నిర్మిస్తేనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నారు.







