ఏపీ అధికార పార్టీ వైసీపీలో ముసలం మొదలైనట్టుగానే కనిపిస్తోంది.ఒక్కో ఎమ్మెల్యే తన అసంతృప్తిని వెళ్లగక్కుతూ, పార్టీ పైన, ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ బయటకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇప్పటికే వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి తిరుగుబాటు ఎగరవేయగా, అదే బాటలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసిపి పై విమర్శలు చేస్తున్నారు.ఇక అంతకుముందే నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పార్టీ పైన, ప్రభుత్వం పైన విమర్శలు చేసి రెబల్ గా మారారు.
ఇప్పటికే ఆయన తరచుగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు.ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో తమకు రాబోయే ఎన్నికల్లో వైసీపీలో టికెట్ దక్కదు అనుకున్న నేతలంతా ముందుగానే టిడిపి తదితర పార్టీలతో మంతనాలు జరిపి, తమకు టిక్కెట్ కన్ఫామ్ అయిన తర్వాత వైసీపీ పై విమర్శలు చేస్తూ బయటకు వెళ్తున్న పరిస్థితి ఇప్పుడు మొదలైంది.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రామనారాయణరెడ్డి ఇద్దరు ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.తమ ఫోన్ లు ట్యాపింగ్ చేశారంటూ విమర్శలు చేశారు.ఇప్పటి వరకు తాము అధికార పార్టీలో ఉన్నందున ఫిర్యాదు చేయలేకపోయామని , దీనికి సంబంధించి అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెబుతున్నారు.శ్రీధర్ రెడ్డికి టిడిపి నుంచి మళ్లీ నెల్లూరు రూరల్ సీటు కన్ఫర్మ్ అయిన తర్వాతనే, ఆయన ప్రభుత్వం పైన , పార్టీ పైన విమర్శలు చేసినట్లుగా అర్థమవుతుంది.
నెల్లూరు , తిరుపతి జిల్లాల్లో మొదలైన ఈ ముసలం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ మొదలయ్యేలా కనిపిస్తుంది.ముఖ్యంగా ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో వైసిపి నుంచి వలసలు ఎక్కువగా చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.
ఈ రెండు జిల్లాల్లో టిడిపి, జనసేన ప్రభావం ఎక్కువగా ఉండబోతుండడం, ఆ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసే ఆలోచనతో ఉండడంతో, టిడిపీ లేదా వైసీపీలో చేరితే తమకు తిరిగే ఉండదని లెక్కలు వేసుకుంటున్నారట.

అంతకంటే ముందుగా ఆ రెండు పార్టీలలో ఏదో ఒక పార్టీ నుంచి టికెట్ కన్ఫామ్ అనే హామీని తెచ్చుకుని వైసీపీని వీడేందుకు చాలామంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారట.ఈ పరిణామాలన్ని అధికార పార్టీ వైసీపీలో కలవరం పుట్టిస్తున్నాయి వలసలను నివారించేందుకు వైసిపి అగ్ర నేతలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉందట.








