తొమ్మిది నెలల క్రితం ఓ ప్రేమ జంట కనిపించకుండా పోయింది.ఈ క్రమంలో ఓ మహిళ, పురుషుడి మృతదేహాలు లభ్యమయ్యాయి.
అయితే చనిపోయింది యువతీ యువకులేనని వారి కుటుంభసభ్యులు భావించారు.దీంతో వీరి మృతదేహాలను పోలీసులు మార్చరీకి తరలించారు.
ఈ క్రమంలో ప్రేమికులిద్దరూ బతికే ఉన్నామంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ప్రేమ జంట వీడియో పోస్ట్ చేయడంతో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో చర్చనీయాంశంగా మారింది.
పట్టణంలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన ఠాగూర్, లలితల కుమార్తె చంద్రిత, శ్రీకాళహస్తి మండలం రామాపురానికి చెందిన చంద్రశేఖర్ ఇద్దరూ ప్రేమించుకున్నారు.అయితే వాలంటీర్గా పనిచేసే చంద్రశేఖర్కు అప్పటికే పెళ్లి అయింది.
అతడికి ఓ బాబు కూడా ఉన్నాడు.అయితే ఈ ఏడాది జనవరి 10వ తేదీన ఇల్లు వదిలి పారిపోయారు.
అయితే కేవీబీపురం మండలం కోవనూరు సమీపంలోని తెలుగు గంగా కాలువలో ఈ నెల 20న బాగా ఉబ్బిన స్థితిలో గుర్తుతెలియని యువతి శవం లభ్యమైంది.
మృతదేహంపై ఉన్న ఆనవాళ్లను బట్టి చనిపోయింది చంద్రిత అని తల్లిదండ్రుల భావించారు.
దీంతో తమ బిడ్డ చావుకు కారణమైన చంద్రశేఖర్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలో చంద్రశేఖర్ను శిక్షించాలంటూ బాధితురాలి తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు.

దీనికి టీడీపీ, జనసేన నేతలు మద్దతు తెలిపారు.రెండు రోజులపాటు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు.ఇంతలో ఏర్పేడు మండలం అంజిమేడు సమీపంలోని బండమాను కాలువ వద్ద ఈ నెల 22న ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది.అది చంద్రశేఖర్ మృతదేహమేనని వెల్లడించారు.
అయితే పోలీసులు అనుమానంతో డీఎన్ఏ టెస్టులు నిర్వహించారు.దీంతో రెండు మృతదేహాలను శ్రీకాళహస్తి ఆస్పత్రికి తరలించారు.
ఈ క్రమంలో తాజాగా మేం బాగున్నామంటూ.త్వరలోనే రామాపురానికి వస్తున్నామని, మాపై వస్తున్నవన్నీ పుకార్లేనని చంద్రశేఖర్, చంద్రిత ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అయితే వీరిద్దరి బతికి ఉండటంతో.అనుమానాస్పదంగా బయటపడిన రెండు మృతదేహాలు ఎవరివనే విషయంపై పుత్తూరు సీఐ సురేశ్ కుమార్ దర్యాప్తు చేపట్టారు.







