మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనైనా విజయం సాధించాలనే లక్ష్యాన్ని ఆ పార్టీ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ విధించారు.అంతేకాదు పెద్ద ఎత్తున ఇతర జిల్లాలోని కీలక నాయకులు ,ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, జడ్పీ చైర్మన్ లు ఇలా అందరికీ మునుగోడు బాధ్యతలను అప్పగించారు.
మండలాలు, గ్రామాల వారీగా ఇన్చార్జిలుగా వారిని నియమించారు.దీంతో ఇన్చార్జిలు గా నియమితులైన వారంతా తమ అనుచరగణం తో సహా నియోజకవర్గంలో మకాం వేశారు.
తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చి మరింత పట్టు పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.గ్రామాలు, మండలాల ఇన్చార్జీలుగా నియమితులైన వారు స్థానిక నాయకులను కలుపుకు వెళ్లాలని అధిష్టానం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ , వీరి మధ్య సయోధ్య కుదరకపోవడం, కొన్నిచోట్ల విభేదాలు తలెత్తుతుండడంతో ఈ వ్యవహారం తలనొప్పిగా మారిందట.
ప్రతి వందమంది ఓటర్లకు ఒక కోఆర్డినేటర్ గా ఎమ్మెల్యేలు తమ అనుచరులను నియమించారు.దీంతో స్థానిక నాయకులు నాన్ లోకల్ నాయకులు మధ్య ఆధిపత్య పోరు, వివాదాలు నడుస్తున్నాయి.
హుజురబాద్ లోను ఇదే రకమైన అనుభవం టిఆర్ఎస్ కు ఎదురయింది ఇప్పుడు అదే రకమైన పరిస్థితి తలెత్తుతుండడంతో టిఆర్ఎస్ అధిష్టానం ఆందోళన చెందుతోంది.మునుగోడు బాధ్యతలు నల్గొండ జిల్లాకు చెందిన వారికి అప్పగిస్తే ఈ సమస్య వచ్చేది కాదని, ఇతర జిల్లాల నాయకులను ఇన్చార్జిలుగా నియమించడంతోనే వివాదాలు ఏర్పడుతున్నాయనే అభిప్రాయం స్థానిక నాయకుల్లో నెలకొంది.
ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గంలోని 86 ఎంపిటిసి స్థానాలను యూనిట్లుగా విభజించి, ఒక్కో యూనిట్ కు ఎమ్మెల్యేను ఇన్చార్జిగా నియమించారు.

మున్సిపాలిటీలోని రెండు వార్డులకు ఒక ఎమ్మెల్యేను ఇన్చార్జిగా నియమించారు.ఈ బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యేలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటనలు చేపడుతున్నారు.వీరి వెంట స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.
అయితే వీరు తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని , ఇన్చార్జీలుగా నియమించబడిన ఎమ్మెల్యేలు తన అనుచరులకే ప్రాధాన్యం ఇచ్చుకుంటూ తమను పట్టించుకోవడంలేదనే బాధ స్థానిక నాయకుల్లో ఎక్కువయ్యిందట.ఈ లోకల్ నాన్ లోకల్ వార్ ను టీఆర్ఎస్ అధిస్థానం ఏ విధంగా పరిష్కరిస్తుందో చూడాలి.







