వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల కోసం అమెరికా గడ్డ మీదకు అడుగుపెట్టిన భారతీయులు క్రమంగా ఇక్కడి సమాజంలో కీలక స్థానాన్ని ఆక్రమించారు.అన్ని రంగాల్లో దూసుకెళ్తూ స్థానిక అమెరికన్లతో పాటు అగ్రరాజ్యంలో స్ధిరపడిన మిగిలిన విదేశీయులకు పోటీ ఇస్తున్నారు.
ఇక ఎన్నికల్లో భారతీయుల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.పెన్సిల్వేనియా, జార్జియా, ఫ్లోరిడా, మిచిగాన్, టెక్సాస్, నార్త్ కరోలినా, న్యూజెర్సీ తదితర కీలక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో స్థిరపడిన ఇండో అమెరికన్లు అభ్యర్ధుల విజయాలను శాసిస్తున్నారు.
అందుకే వీరి కరుణ కోసం రిపబ్లికన్లు, డెమొక్రాట్లు తెగ తపిస్తుంటారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలు- 2020లో భారతీయుల హవా స్పష్టంగా కనిపించింది.
ఒక్క అమెరికాలోనే కాదు బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, దక్షిణాఫ్రికా ఇలా చాలా దేశాల్లో కింగ్ మేకర్లుగా ప్రవాసులు వున్నారు.
ఈ నేపథ్యంలో వచ్చే నవంబర్లో అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో భారతీయులను ప్రసన్నం చేసుకునేందుకు పలు పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి.
వీరిలో అందరికంటే ముందే వున్నానని సంకేతాలు పంపుతున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.దీనిలో భాగంగా భారత్ – అమెరికాల స్నేహ సంబంధాలపై హిందీలో నినాదాన్ని రూపొందించారు.రిపబ్లికన్ హిందూ కొలియేషన్ (ఆర్హెచ్సీ) విడుదల చేసిన వీడియోలో Bharat and America sabse achhe dost”(భారత్ , అమెరికాలు మంచి స్నేహితులు) అంటూ ట్రంప్ హిందీలో అన్న మాటలు వైరల్ అవుతున్నాయి.30 సెకన్ల ఈ వీడియోలో రిపబ్లికన్ హిందూ కొలియేషన్కి చెందిన తన మద్ధతుదారుడు, చికాగోకు చెందిన వ్యాపారవేత్త శలభ్ కుమార్తో కలిసి కూర్చొన్నారు ట్రంప్.

ఈ కొత్త నినాదం.2016లో హిందీలో ట్రంప్ చేసిన అబ్కీ బార్ ట్రంప్ సర్కార్’’ అనే మాటల నుంచి ప్రేరణ పొందింది.ఇది అప్పటి భారతీయ అమెరికన్లను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు కీలకమైన స్వింగ్ రాష్ట్రాలలో ట్రంప్ విజయం సాధించడం వెనుక కీలక పాత్ర పోషించింది.అప్పటి ‘‘అబ్కీ బార్ ట్రంప్ సర్కార్’’ , నేటి ‘‘ భారత్ అమెరికా సబ్సే అచ్చే దోస్త్ రెండూ నినాదాల్లోనూ కీలకపాత్ర పోషించిన శలభ్ కుమార్ పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…ప్రస్తుత నినాదాన్ని తమ ఆర్హెచ్సీ గ్రూప్ భారతీయ మీడియాలో వైరల్ చేయాలని భావిస్తున్నట్లు చెప్పారు.
నవంబర్ 8న జరిగే మధ్యంతర ఎన్నికలకు ఓటు వేయాలని కుమార్ పిలుపునిచ్చారు.ఇకపోతే.ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు తమ మెజారిటీని తిరిగి సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.అలాగే పెన్విల్వేనియా, ఒహియో, విస్కాన్సిన్, అరిజోనా, జార్జియా రాష్ట్రాల్లోని సెనేట్ స్థానాలపై రిపబ్లికన్లు దృష్టి పెట్టారు.







