యాదాద్రి జిల్లా:తెలంగాణలో ప్రతి స్థాయిలో అవినీతి జరుగుతోందని కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ధ్వజమెత్తారు.తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన వారికి నిజమైన నివాళి ఇవ్వాలంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని తరిమికొట్టాల్సిందేనని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.
యాదగిరిగుట్టలోని వంగపల్లి నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ సభలో కేంద్రమంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.మొదట తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన షెకావత్ ఎంతో పవిత్ర స్థలమైన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని,తన జీవితంలో మరిచిపోలేని ఘటనగా పేర్కొన్నారు.
ప్రజలు మార్పును కోరుకుంటున్నారని,బండి సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణలో భాజపా ప్రభుత్వం వస్తుందన్నారు.అణగారిన కులాలంటే కేసీఆర్కు గిట్టదన్నారు.
కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని,ఆ ప్రాజెక్టు కేసీఆర్కు డబ్బు సంపాదించే మిషన్ అయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.అవినీతి పరులను జైల్లో వేసేందుకు భాజపాకు అధికారం ఇవ్వాలన్నారు.
తెలంగాణలో అవినీతి ప్రభుత్వాన్ని తరిమికొడతామని షెకావత్ స్పష్టం చేశారు.