యువత జీవితాన్ని డ్రగ్స్ నాశనం చేస్తున్నాయి.ఎక్కడ చూసినా సులభంగా డ్రగ్స్ లభిస్తున్నాయి.
పోలీసులు ఎంత నిఘా వేసినా అడ్డదారుల్లో స్మగ్లర్లు డ్రగ్స్ను రవాణా చేస్తున్నారు.పోలీసులు కూడా అవాక్కయ్యే రీతిలో స్మగ్లింగ్ జరుగుతున్న తీరు చూస్తే అంతా ఆశ్చర్యపోవాల్సిందే.
అందరి కళ్లు గప్పి స్మగ్లింగ్ చేస్తున్నారు.గతంలో సూర్య హీరోగా వచ్చిన ‘వీడొక్కడే‘ సినిమాలో చిత్ర విచిత్రంగా డ్రగ్స్ను హీరో స్మగ్లింగ్ చేసే సన్నివేశాలను తెరకెక్కించారు.
ఇక తాజాగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప సినిమాలోనూ స్మగ్లింగ్ ఎంత సులువుగా చేయొచ్చో చూపించారు.వీటిని ఆదర్శకంగా తీసుకున్నారో ఏమో, కొందరు స్మగ్లర్లు ఎవరికీ అనుమానం రాని రీతిలో డ్రగ్స్ను స్మగ్లింగ్ చేస్తున్నారు.
అయితే వారి పాపం పండి, పోలీసులకు పట్టుబడ్డారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
బ్రూ స్మాల్ చిన్న ప్యాకెట్ల గురించి అందరికీ తెలిసే ఉంటుంది.రూ.2, రూ.5, రూ.10 చొప్పున ఆయా ప్యాకెట్ల ధరలు ఉంటాయి.వాటిని కిరాణా దుకాణంలో వేలాడదీస్తూ విక్రయిస్తున్నారు.అయితే కొందరు ఒక్కో కాఫీ ప్యాకెట్ రూ.6 వేలు, రూ.10 వేలు చొప్పున అమ్ముతున్నారు.విషయం తెలియగానే హైదరాబాద్ పోలీసులకు అనుమానం వచ్చింది.
దీంతో అవి డ్రగ్స్ అని పోలీసులకు అనుమానం తలెత్తింది.అందులోనూ విదేశీయుడు వాటిని విక్రయిస్తుండడంతో పోలీసులకు అనుమానం బలపడింది.దీంతో మాటు వేసి, అతడు వాటిని అమ్ముతుండగా హైదరాబాద్ పోలీసులు ఇటీవల పట్టుకున్నారు.56 గ్రాముల కొకైన్ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు.పురానా పుల్ ప్రాంతంలో కొకైన్ విక్రయిస్తుండగా ఆఫ్రికన్ దేశస్థుడైన మోరిస్ను అరెస్టు చేశారు.అతడు అందించిన సమాచారంతో పలు చోట్ల దాడులు చేశారు.
బ్రూ కాఫీ ప్యాకెట్లలో ఎవరికీ అనుమానం రాకుండా వనస్థలిపురం, సన్ సిటీ నుంచి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఒక్కో ప్యాకెట్లో ఒక గ్రాము కొకైన్ ఉంటుంది.ఢిల్లీ నుంచి గ్రాము కొకైన్ను వృద్ధులకు రూ.5వేలు, కొత్త వారికి రూ.6వేలకు విక్రయిస్తున్నట్లు హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ విజయ్ తెలిపారు.దీనిపై మరింత లోతైన విచారణను నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరినీ అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెప్పారు.