ప్రపంచం ఎంతో అభివృద్ధి చెందుతున్నా.ఇప్పటికీ కొన్ని విషయాల్లో మనం వెనుకబడే ఉంటున్నాం.
అందరూ సమానమేనని చట్టాలు చెబుతున్న మాట మరిచి కొందరిపై వివక్ష చూపుతూ నాగరికతను మరిచిపోతున్నాం.అందులో ముఖ్యమైనది దళితులను అంటరానివారుగా చూడడం.
రాజకీయంగా, సామాజికంగా వారు ఎన్నో అవమానాలు ఎదుర్కొంటున్నారు.వారికి దక్కాల్సిన అవకాశాలను దక్కకుండా చేసి కొందరే అనుభవిస్తున్నారు.
అంటరానితనాన్ని, కులాల అంతరాలను సమసిపోయేట్టు చేయాలని వీటిపై అంబేద్కర్, జగ్జీవన్ రామ్ వంటి మహనీయులు పోరాటం చేశారు.స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం మనం రూపొందించుకున్న రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిషేధించే నిబంధనను కూడా ఏర్పాటు చేసుకున్నాం.
అయినప్పటికీ నాటి నాయకులు ఆశించిన ఫలితాలు ఇంకా పూర్తిగా అనుభవంలోకి రాకపోవడం విచారకరం.
ఇక అసలు విషయంలోకి వెళితే… కెనడాలోని బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్లోని న్యూడెమొక్రాటిక్ పార్టీ ప్రభుత్వం ఏప్రిల్ నెలను దళిత చరిత్ర నెలగా గుర్తించింది.
దళితులు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల వర్గాల చరిత్రలో ముఖ్యమైన వ్యక్తులు, సంఘటనలను గుర్తించుకోవడానికి ప్రతి ఏడాది దళిత చరిత్ర మాసంగా జరుపుకుంటారు.ముఖ్యంగా దళితుల అభ్యున్నతి కోసం కృషి చేసిన , భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అనుచరులు ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ప్రతి ఏటా ఏప్రిల్లో దళిత మాసాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.
వర్ణ వివక్ష, జాత్యహంకారాలపై పోరాటం, అందరికీ న్యాయం, సమానత్వాన్ని తీసుకురావడానికి ఈ నెలను పాటిస్తున్నట్లు బ్రిటీష్ కొలంబియా ప్రభుత్వం తెలిపింది.
దళిత వర్గాలకు ఏప్రిల్ ఒక ముఖ్యమైన నెల… డాక్టర్ బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, మంగు రామ్ ముగోవాలియా, సంత్ రామ్ ఉదాసి వంటి దళిత నేతలు, సంఘ సంస్కర్తల జయంతి, వర్ధంతిలు ఈ మాసంలో వున్నాయని బ్రిటీష్ కొలంబియా ప్రభుత్వం వెల్లడించింది.