ప్రస్తుతం తెలంగాణాలో ఎన్నికల వాతావరణం వేడిమీద ఉంది.టీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా ముందుకెళ్తున్న మహాకూటమి కొద్ది కొద్దిగా బలం పెంచుకుంటూ టీఆర్ఎస్ కి ముచ్చెమటలు పట్టిస్తోంది.
ముఖ్యంగా తెలంగాణాలో మొన్నటివరకూ బలహీనంగా ఉన్న టీడీపీ కూడా ఇప్పుడు బలపడినట్టు కనిపిస్తోంది.ఇక ఏపీ విషయానికి వస్తే… ఇక్కడ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా… ఎవరి బలం ఎంత అనే సందేహాలు అందరిలోనూ కనిపిస్తున్నాయి.
ఇక్కడ ప్రధానంగా మూడు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ, జనసేన మధ్య ముక్కోణపు పోటీ తీవ్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.ఇక వామపక్ష పార్టీలు జనసేనతో కలిసి అడుగులు వేసేందుకు ఎప్పుడో సిద్ధం అయిపోయాయి.
ఇక కాంగ్రెస్, బీజేపీ పార్టీల విషయానికి వస్తే ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగాల్సి ఉంది.అయితే వీటి ప్రభావం నామమాత్రమే.

అయితే ఏ జిల్లాల్లో ఏ పార్టీకి ఎంతెంత బలం ఉంది .? వచ్చే ఎన్నికల్లో ఎవరికి అవకాశం ఉండబోతోంది అనేది పరిశీలిస్తే… రాయలసీమలోని అనంతపురం మినహా మిగిలిన మూడు జిల్లాల్లోనూ మళ్లీ వైసీపీ ప్రభావం ఎక్కువగానే కనిపిస్తోంది.రెడ్డి సామాజిక వర్గం అంతా కూడా జగన్ కు మద్దతు పలుకుతున్నారు.ఈ నేపథ్యంలో ఈ జిల్లాల్లో వైసీపీ హవా ఎక్కువగా కనిపించే ఛాన్స్ కనిపిస్తోంది.కర్నూలు జిల్లాలో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారినా అక్కడ మాత్రం క్షేత్రస్థాయిలో ఆ పార్టీయే బలంగా ఉంది.ఇక వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లాతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు సొంత జిల్లాలోనూ వైసీపీకి సానుకూలత కనిపిస్తోంది.
దీంతో సీమలోని మూడు జిల్లాల్లోనూ వైసీపీ జెండా రెపరెపలాడే ఛాన్స్ కనిపిస్తోంది.
టీడీపీకి ఒకప్పుడు కంచుకోటలా ఉన్న అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో టీడీపీ చూపించిన హవా ఇప్పుడు కనిపించడం లేదు.
దీంతో ఇక్కడ టీడీపీ వైసీపీ చెరిసగం దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.ఇక్కడ జనసేన ప్రభావం నామమాత్రంగా ఉండే అవకాశం కనిపిస్తోంది.నెల్లూరు జిల్లాలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది.ఇక్కడ క్షేత్రస్థాయిలో పార్టీకి బలం ఉన్నా సమర్ధవంతమైన నాయకత్వం లేకపోవడం వల్ల పార్టీ బలహీనపడింది.
ఇక ప్రకాశం జిల్లాలో టీడీపీ , వైసీపీ మధ్య హోరాహోరీ ఉంది.వైసీపీ క్షేత్రస్థాయిలో బలంగా ఉన్నా నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతోంది.
గుంటూరు, కృష్ణాల్లో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది.

ఇక అత్యంత కీలకం అయిన పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల్లో.కాపు సామాజిక వర్గం మొత్తం కూడా జనసేనకు అండగా ఉండబోతోంది.ఇక, మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మొన్నటి వరకు టీడీపీ హవా కనిపించినా ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడంలేదు.
అంతే కాదు ఈ జిల్లాల్లో ప్రధానంగా జనసేన ప్రభావం కూడా కనిపించబోతోంది.







