చైతూను చూసి కాదు.. మారుతి వల్ల ఆ రేటు

ఈమద్య కాలంలో తెలుగు సినిమాలకు ఓవర్సీస్‌లో భారీ రేట్లు దక్కుతున్నాయి.కలెక్షన్స్‌ కూడా అదే స్థాయిలో వస్తున్నాయి.

ఈమద్య విడుదలైన రంగస్థలం, భరత్‌ అనే నేను, మహానటి చిత్రాలు ఓవర్సీస్‌లో ఏ రేంజ్‌లో కలెక్షన్స్‌ను దక్కించుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.చిన్న చిత్రాలు కూడా ఓవర్సీస్‌లో మంచి వసూళ్లను సాధిస్తున్నాయి.

మారుతి దర్శకత్వంలో వచ్చిన ‘భలే భలే మగాడివోయ్‌’ మరియు ‘మహానుభావుడు’ చిత్రాలు ఓవర్సీస్‌లో మిలియన్‌ మార్క్‌ను సునాయాసంగా క్రాస్‌ చేసింది.ఆ కారణంగానే తాజాగా ఈయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రం కూడా మంచి రేటుకు అమ్ముడు పోయింది.

నాగచైతన్య, అను ఎమాన్యూల్‌ జంటగా తెరకెక్కుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లో మరియు ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు మారుతి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.చైతూ కెరీర్‌లో విభిన్నమైన చిత్రాల్లో ఇది ఒకటిగా నిలిచి పోతుందనే నమ్మకంను అక్కినేని ఫ్యాన్స్‌ వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

అత్తా, అల్లుడి మద్య సాగే వార్‌ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టైటిల్‌ను చూస్తుంటే అనిపిస్తుంది.కనుక ఇదో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఓవర్సీస్‌లో ఫ్యామిలీ ఓరియంటెడ్‌ చిత్రాలకు మంచి మార్కెట్‌ ఉంది.అందుకే దాదాపు మూడు కోట్లు పెట్టి ఈ చిత్ర రైట్స్‌ను ప్రముఖ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

ఓవర్సీస్‌లో ఇప్పటి వరకు నాగచైతన్య నటించిన ఏ సినిమా కూడా పెద్దగా మెప్పించలేక పోయింది.‘మనం’ అక్కడ పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు రాబట్టినా కూడా అది నాగచైతన్య ఖాతాలో వేయలేం.

ఆ సినిమా విభిన్నమైనది కావడంతో పాటు నాగార్జున, సమంతలు ఆ సినిమాలో ఉండటం వల్ల ఓవర్సీస్‌లో భారీ రేటు పలికింది.ఇప్పుడు ‘శైలజ రెడ్డి అల్లుడు’ సినిమాకు మంచి రేటు అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో నాగచైతన్య క్రేజ్‌ పెరిగిందంటూ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అయితే ఆ క్రేజ్‌ నాగచైతన్య వల్ల కాదని, ఆ క్రేజ్‌కు కారణం మారుతి అంటూ కొందరు అంటున్నారు.మారుతి గత చిత్రాల మార్కెట్‌ మరియు సక్సెస్‌ రేటును దృష్టిలో పెట్టుకుని ‘శైలజ రెడ్డి అల్లుడు’ చిత్రాన్ని మూడు కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

Advertisement

డిస్ట్రిబ్యూటర్‌ పెట్టిన మొత్తం రావాలి అంటే చిత్రం కనీసం మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేయాలి.అలా చేసినప్పుడు మాత్రమే పెట్టుబడి వస్తుంది.

ఇక లాభాలు రావాలి అంటే మిలియన్‌ డాలర్లకు పైగానే రావాల్సి ఉంది.చిత్ర యూనిట్‌ సభ్యులు ఈ చిత్రం మినిమం 1.5 మిలియన్‌ డాలర్లను వసూళ్లు చేస్తుందనే నమ్మకంతో ఉన్నారు.శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మారుతి ప్రయత్నాలు చేస్తున్నాడు.