టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ 2024 ఎన్నికల్లో టిడిపిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా యువ గళం పేరుతో 400 రోజుల పాదయాత్రకు రేపటి నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు.చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారు.
దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ యాత్ర ద్వారా ప్రజలలోను, పార్టీ శ్రేణుల్లోనూ టిడిపి పై మరింత ఆసక్తి , ఆదరణ పెంచే విధంగా లోకేష్ ప్రయత్నించబోతున్నారు.
గతంలో వైసిపి అధినేత గా ఉన్న జగన్ పార్టీని అధికారంలో తీసుకువచ్చేందుకు పాదయాత్ర చేపట్టారు.ఆ యాత్రకు విశేషమైన స్పందన రావడంతో పాటు, వైసిపి అధికారంలోకి వచ్చేందుకు దోహదం చేసింది.
ఈయన నేపథ్యంలో లోకేష్ కూడా పాదయాత్రను నమ్ముకున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఏపీ ప్రజలను ఉద్దేశించి లోకేష్ బహిరంగ లేఖ రాశారు.
తన పాదయాత్రను ముందుండి నడిపించాలని , తనను ఆశీర్వదించి ఆదరించాలంటూ లేఖలో ప్రజలను కోరారు.ఏపీ, తెలంగాణ విభజన తర్వాత ఏపీ లోటు బడ్జెట్ తో ఏర్పడిన రాష్ట్రాన్ని టిడిపి ప్రభుత్వం గాడిని పెట్టిందని, నవ్యాంధ్ర నిర్మాణానికి కృషి చేసిందని, కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ అభివృద్ధిని విధ్వంసం చేసే విధంగా పరిపాలన చేస్తోందని లోకేష్ లేఖలో వివరించారు.
ప్రజలకు రక్షణ కల్పిస్తూ శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థను జగన్ తన ఫ్యాక్షన్ రాజకీయాలను నడిపించే ప్రైవేటు సైన్యంగా వాడుకుంటున్నారని విమర్శించారు.ఈ అరాచక పాలన తమకు వద్దంటూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారని , రాష్ట్రంలో మహిళల మాన, ప్రాణాలకు రక్షణ కరువైందని ఈ సందర్భంగా ఆందోళన వ్యక్తం చేశారు .
పరిశ్రమల యజమానులను భయపెట్టి రాష్ట్రం వదిలిపోయే విధంగా చేస్తున్నారని లోకేష్ విమర్శలు చేశారు.సరైన ఉద్యోగాలు దొరక్క యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారని, రైతులు పండించిన ధాన్యాన్ని స్వతంత్రంగా అమ్ముకోలేకపోతున్నారని లోకేష్ లేఖలో ప్రస్తావించారు .ఉద్యోగులకు సరైన సమయంలో జీతాలు కూడా ఇవ్వడం లేదని , బిల్లు రాక కాంట్రాక్టర్లు ఇబ్బందులు పడుతున్నారని, ఇవన్నీ సైకో పాలన దుష్ఫలితాలు అంటూ లేఖలో లోకేష్ వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.