వైసీపీ అధినేత జగన్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది.దీనిపై జగన్ స్పందించకపోయినా… ఆ పార్టీ నాయకులు కూడా… పవన్ కి కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణా నాయకులను విమర్శించని వైఎస్ జగన్కు మగతనం లేదని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అనడాన్ని వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పేర్నినాని తప్పుబట్టారు.
రాజకీయాల్లో మగతనం ఉండదని, నాయకత్వంతోనే ప్రజల విశ్వాసం పొందాలని వ్యాఖ్యానించారు.గత ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీ తరపున ప్రచారం చేసి, వారిచ్చే హామీలకు తనది పూచీకత్తు అని, ప్రశ్నించడానికే తాను పార్టీ పెట్టానని చెప్పిన పవన్ కల్యాణ్ నాలుగేళ్లు ఎందుకు నిద్రపోయారని ప్రశ్నించారు.ఎన్నికలు ఏడాది ఉండగా పవన్ కళ్లు తెరిచారని, పాలక ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి ప్రతిపక్షాన్ని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు.
అగ్రిగోల్డ్, ఫాతిమా కాలేజీ సమస్యలపై పవన్ చేసిన ప్రకటనలు ఏమయ్యాయని, వారి పట్ల పవన్ కల్యాణ్ చేసిన పోరాటం ఏంటో చెప్పాలని సూటిగా అడిగారు.రాజదాని రైతులకు అండగా ఉంటానని చెప్పిన హామీని పవన్ గాలికి వదిలేశారని ఆయన ఎద్దేవా చేశారు.