నారా లోకేష్ ను మొదటి నుంచి ర్యాగింగ్ చేస్తున్నట్లుగానే వైసీపీ నాయకులు వ్యవహరిస్తూ వస్తున్నారు.గత టీడీపీ ప్రభుత్వంలో లోకేష్ మంత్రిగా ఉన్న సమయం నుంచే, ఆయన పై వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ఇప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నా వదిలిపెట్టకుండా అంతకంటే ఎక్కువ స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.రానున్న రోజుల్లో టీడీపీ పగ్గాలు లోకేష్ చేతికి రాబోతున్నాయి అనే అభిప్రాయంతో ఆయనను ప్రజల్లో చులకన చేసి రాజకీయంగా ఆయన అసమర్థుడు అనే అభిప్రాయాన్ని కలుగజేయాలని వైసీపీ ఒక ప్లాన్ ప్రకారం వ్యవహరిస్తూ వస్తోంది.
అందుకే సందర్భం ఉన్నా, లేకపోయినా లోకేష్ ను టార్గెట్ చేసుకుంటూ, ఆయనను ర్యాగింగ్ చేస్తూ వస్తోంది.
ఈ వ్యవహారం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆవేదన కలిగిస్తున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఏం చేయలేని పరిస్థితిలో ఆయన సైలెంట్ గానే ఉండిపోతున్నారు.
ఇక కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి లోకేష్ హైదరాబాద్ కే పరిమితమయ్యారు.మధ్యలో ఒకసారి ఏపీకి వచ్చినా, మళ్లీ హైదరాబాద్ లోని తన నివాసానికి పరిమితమైపోయారు.
దీనిపైన వైసీపీ నాయకులు పదే పదే విమర్శలు చేస్తున్నారు.అది కాకుండా లోకేష్ పై అనేక అవినీతి ఆరోపణలు చేస్తూ, అవహేళన చేస్తూ ప్రజల్లో లోకేష్ వ్యవహారాలపై చర్చ జరిగేలా చేస్తున్నారు.
అయితే ఇదంతా వైసీపీకి మేలు చేయకపోగా, లోకేష్ కు ఇదంతా కలిసి వస్తుందనే విషయాన్ని కాస్త ఆలస్యంగా వైసీపీ గుర్తించింది.
ఈ మేరకు ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసిన విషయం ఏమిటంటే, లోకేష్ చేస్తున్న విమర్శలపై ప్రజల్లో ఆయనకు సానుభూతి వ్యక్తమవుతోందని, వైసీపీ నాయకులు ఆయనను ఎంతగా టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తుంటే, అంతగా ఆయన బల పడుతున్నాడని, అనవసరంగా వైసీపీ నాయకులు లోకేష్ ను ఆడిపోసుకుంటున్నారు అనే అభిప్రాయాలు జనాల్లోకి వెళ్ళినట్లుగా గుర్తించింది.
అందుకే ఇకపై లోకేష్ విషయంలో పెద్దగా ఎవరూ స్పందించ వద్దని, స్పందించి లోకేష్ ను హీరో చేయవద్దంటూ, వైసీపీ అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్లుగా తెలుస్తోంది.
ఇప్పటి వరకు లోకేష్ ను విమర్శిస్తూ, పోటీ పడుతూ వచ్చిన నాయకులంతా ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అనూహ్యంగా వైసీపీ అధిష్టానం తీసుకున్న ఈ నిర్ణయంతో లోకేష్ కు పెద్ద గండమే తప్పినట్టు గా కనిపిస్తోంది.