ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కి కూడా సొంతింటి పోరు మొదలైనట్లు తెలుస్తుంది.అందరిని తృప్తి పరచాలని ప్రతి ఒక్కరికీ సమ న్యాయం చెయ్యాలి అంటూ ఏకంగా మంత్రి పదవులను సైతం రెండున్నరేళ్లు ఒకరికి,రెండున్నరేళ్లు మరొకరికి అప్పగించాలని అంతా ప్రణాళిక ప్రకారం వెళుతున్న జగన్ పార్టీ లో కూడా అసంతృప్తి తొంగి చూస్తుంది.
ప్రతిపక్ష పార్టీలతో అసలుకే తలనొప్పులతో సతమతమవుతున్న జగన్ కు ఇప్పుడు సొంత పార్టీ నుంచి కూడా తలనొప్పులు తప్పడం లేదు.ఓ వైపు ఎంపీలు మరోవైపు ఎమ్మెల్యేలు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడుతుండడం తో తల పట్టుకుంటున్న జగన్ కు ఇప్పుడు తాజాగా మరోసమస్య వచ్చి పడింది.
ఆ పార్టీ సీనియర్ నేత ఒకరు వైసీపీకి గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది.ప్రకాశం జిల్లాలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత ముద్దన తిరుపతి నాయుడు తన సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు తెలుస్తుంది.
డీసీఎంఎస్ చైర్మన్ పదవిని ఆశించిన ముద్దన, ఆ పదవిని రామనాథంకు ఇవ్వడంతో అలకబూని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అసంతృప్తి తోనే ఆయన పార్టీ కి రాజీనామా చేశారు.
ఈ మేరకు మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి ఆయన తన రాజీనామా లేఖను అందజేశారు.అయితే పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికే పదవులు దక్కుతున్నాయని ఆరోపించిన ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై అనుచరులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.
అయితే ఏ పార్టీ లో చేరుతున్నారు అన్న దానిపై మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు.