గుంటూరు జిల్లాలో రాజధాని నియోజకవర్గం అయిన తాడికొండ నుంచి పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యే అయ్యారు వుండవల్లి శ్రీదేవి.రాజధాని ఏరియా కావడంతో ఈ నియోజకవర్గానికి మంచి డిమాండ్ ఉంది.
అయితే ఇప్పుడు కొందరు నేతలు ఇక్కడ శ్రీదేవి పెత్తనానికి చెక్ పెట్టి ఇక్కడ కూడా తమ హవా చెలాయించాలని చూస్తున్నారట.ఈ క్రమంలోనే ఆమెను సొంత పార్టీకి చెందిన నేతలే టార్గెట్ చేస్తూ ఆమెకు ఇబ్బంది కలిగించేలా వ్యవహరిస్తున్నారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది.
ఇటీవల ఆమె గురించిన పలు వ్యవహారాలు మీడియాలో హైలెట్ అవుతున్నాయి.ఆమె ఓ పోలీస్ అధికారిని తిడుతోన్న ఆడియో క్లిప్ వైరల్ అయ్యింది.అలాగే ఆమె నియోజకవర్గంలో జరుగుతోన్న ఇసుక దందాలు, అవినీతి, క్రషర్ల యాజమాన్యాలను టార్గెట్ చేస్తున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి.ఇక ఆమెను నియోజకవర్గంలో సొంత పార్టీ కార్యకర్తలే వ్యతిరేకిస్తోన్న వార్తలు కూడా తరచూ మీడియాలో వస్తున్నాయి.
ఇక జిల్లాలో ఎన్నో నియోజకవర్గాల్లో జరుగుతోన్న పేకాట వ్యవహారాలు హైలెట్ కాకపోయినా తాడికొండలో మాత్రం పెద్ద రచ్చ అయ్యింది.
ఎమ్మెల్యేను ఇంతలా టార్గెట్ చేస్తోంది సొంత పార్టీ ప్రజా ప్రతినిధులే అంటున్నారు.ఆమెకు బాపట్ల ఎంపీ నందిగం సురేష్కు మధ్య గ్యాప్ ఉంది.పైగా సురేష్ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని చూస్తున్నాడు.
ఇక ఆయనది తాడికొండ నియోజకవర్గమే.ఇక ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ సైతం గతంలో ఇక్కడ నుంచి రెండుసార్లు గెలిచారు.
ఈ క్రమంలో ఆయన కూడా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేయాలని పక్కా ప్లానింగ్తో చాపకింద నీరులా తన పని తాను చక్క బెడుతున్నారని అంటున్నారు.
డొక్కా మాణిక్య వరప్రసాద్ వర్గం తాడికొండ రాజకీయాలపై పట్టు కోసం తెర వెనుక శ్రీదేవిని టార్గెట్ చేస్తోందనే టాక్ నడుస్తోంది.ఇక పక్కనే ఉన్న సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు కూడా సత్తెనపల్లిలో పెత్తనం కోసం శ్రీదేవిని ఏదోలా బద్నాం చేసే కార్యక్రమాలకు పరోక్షంగా మద్దతు ఇస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.మరి వీటిల్లో వాస్తవాలు ఎలా ఉన్నా ఇవి గుంటూరు రాజకీయాల్లో వైరల్ అవుతున్నాయి.