ఏపీలో సీఎంగా ఉన్నది ఆషామాషీ వ్యక్తి కాదు.రాజకీయాల్లో ఎన్నో ఎదురు దెబ్బలు ఎదుర్కొని ఎన్నో ఒడిదుడుకులు చవిచూసి వచ్చారు.
కష్టాలు, ఇబ్బందులు, అసంతృప్తులు, అవహేళనలు, వెన్నుపోట్లు ఇలా అన్నిటినీ దాటుకుని వచ్చారు.అన్నిటినీ అధిగమించి ఈ స్థాయికి జగన్ చేరుకోగలిగారు.151 సీట్లతో తిరుగులేకుండా అధికారాన్ని దక్కించుకున్నారు.అలాగే 22 ఎంపీ సీట్లు తోనూ, భారీ మెజారిటీ తో జగన్ వైసీపీ జెండా రెపరెపలాడించారు.
ఇతర పార్టీల నుంచి పెద్దఎత్తున నాయకులు వచ్చి చేరేందుకు ప్రయత్నిస్తున్నా, ఆచితూచి వారికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, వస్తున్నారు.చంద్రబాబు చేసిన తప్పు చేసేందుకు ఇష్టపడకుండా ఎమ్మెల్యే లను చేర్చుకోకుండా సంయమనం పాటిస్తున్నారు.
ఇలా ఉండగానే అకస్మాత్తుగా సొంత పార్టీ ఎంపీ అసమ్మతి రాగం వినిపించడం, పార్టీ విధానాలకు వ్యతిరేకంగా గొంతెత్తి మాట్లాడుతూ, పెద్దఎత్తున ప్రభుత్వంపైన, పార్టీ నాయకులపైన విమర్శలు చేస్తూ ఉండడం వంటివి జగన్ స్పీడ్ కు బ్రేకులు పడినట్లుగా అయింది.నరసాపురం నుంచి వైసీపీ తరఫున ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణంరాజు బిజెపికి దగ్గర అయ్యేందుకు సొంత పార్టీపై అసమ్మతి గళం విప్పారు అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
పార్టీని, అధినేతను విమర్శిస్తే, ఫలితంగా తనపై సస్పెన్షన్ వేటు వేస్తారని రఘురామకృష్ణంరాజు భావించినట్లు కనిపిస్తోంది.
జగన్ మాత్రం ఈ విషయంలో అసలు ఏమాత్రం స్పందించడం లేదు సరికదా, పట్టించుకోనట్టు వ్యవహరిస్తున్నారు.అంతేకాదు, పార్టీ నాయకులను సైతం రఘురామకృష్ణంరాజు వ్యవహారంలో ఎటువంటి విమర్శలు చేయవద్దని సూచించడంతో, కొంతకాలంగా రాజకీయ వాతావరణం చల్లబడింది.కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం ఈ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు.
నిత్యం ఏదో ఒక అంశంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, మీడియా ముందు హడావుడి చేస్తూ, వైసీపీ ప్రభుత్వానికి ఆగ్రహం కలిగించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నా, జగన్ మాత్రం పట్టించుకోవడం లేదు.
ఒకవేళ రఘురామకృష్ణంరాజు విషయంలో స్పందిస్తే, అనవసరంగా ఆయనకు ప్రాధాన్యం పెరిగిపోతుందని, అలాగే ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తే ,యథేచ్ఛగా బిజెపిలో చేరేందుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందనే అభిప్రాయంలో జగన్ ఉండడంతో, రఘురామకష్ణంరాజు ఎంతగా కవ్విస్తున్నా, జగన్ మాత్రం అవేవీ పట్టించుకోనట్టు గానే ముందుకు వెళ్తున్నారు.
కానీ తెరవెనుక మాత్రం రఘురామకృష్ణంరాజు కు వ్యతిరేకంగా, ఢిల్లీ స్థాయిలో వైసీపీ ఎంపీలు హడావుడి చేస్తూ వస్తున్నారు.లోక్ సభ స్పీకర్ కు రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై ఫిర్యాదు చేయడమే కాకుండా, సస్పెన్షన్ వేటు వేయాల్సిందిగా కోరారు.
తాను వైసీపీ ప్రభుత్వం పైనా, ఆ పార్టీ విధానాలపైనా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నా, కనీసం ఆ పార్టీ నాయకులు ఎవరు స్పందించకపోవడంపై అనర్హత వేటు వేయించేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తుండటం, అదే సమయంలో బిజెపి నుంచి తనకు సరైన మద్దతు లభించకపోవడం వంటివి రఘురామకృష్ణం రాజు కి మింగుడుపడడంలేదు.అసలు తనకంటే వైసీపీతోనే ఎక్కువ అవసరం ఉండడంతో తనను బీజేపీ పట్టించుకోదు అనే అభిప్రాయంలో రాజుగారు ఆందోళన చెందుతున్నట్టుగా కనిపిస్తోంది.