మొదటి నుంచి పంచాయతీ ఎన్నికల విషయంలో వైసిపి ప్రభుత్వం కాస్త వెనకడుగు వేస్తున్నట్టుగానే కనిపిస్తూ వస్తోంది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ఎన్నికల అధికారిగా ఉండగా, ఎన్నికలకు వెళ్ళకూడదనే ఆలోచనతో ఉంటూ వచ్చిన వైసీపీకి మింగుడుపడని విధంగా ఏపీ లో పంచాయతీ ఎన్నికలు అనివార్యమయ్యాయి.
ఎక్కువగా ఏకగ్రీవాల మీద దృష్టిపెట్టి పంచాయతీ లను సొంతం చేసుకోవాలని వైసీపీ భావిస్తోంది.ఎన్నికలు లేకుండా పంచాయతీలను ఏకగ్రీవం చేసుకుంటే, భారీ నజరానాలు కూడా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
ఇది ఇలా ఉంటే వైసీపీ ఎమ్మెల్యే లకు ఈ ఎన్నికలు పెద్ద చిక్కే వచ్చిపడేలా చేస్తున్నాయి.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దఎత్తున ఇతర పార్టీల నాయకులను చేర్చుకుని గ్రామస్థాయి నుంచి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించారు.
ఆ సమయంలో వివిధ హామీలు సైతం ఇచ్చారు.ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో సీట్ల విషయానికి వచ్చేసరికి , మొదటి నుంచి వైసిపి లో ఉన్న నాయకులు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నాయకులు ఎంతో మంది ఆ టికెట్ల కోసం పోటీ పడుతుండడంతో, ఎవరికి టికెట్ కేటాయించాలి అనే విషయంలో స్థానిక ఎమ్మెల్యే లకు తలబొప్పి కడుతోంది.
ఎవరికి టికెట్ ఇచ్చినా తంటనే అన్నట్లుగా ఇప్పుడు వ్యవహారాలు చోటుచేసుకుంటున్నాయి.
ఇప్పటికీ గ్రామస్థాయి నుంచి గ్రూపు తగాదాలు, పంచాయతీలు ఎడతెరిపి లేకుండా ఉన్నాయి.
వీటి నుంచి ఎలా బయటపడాలి అనేది అర్థంకాని పరిస్థితి స్థానిక ఎమ్మెల్యేలకు వచ్చి పడింది.ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీలో గ్రూపు తగాదాలు మరీ శృతి మించి పోయాయి.
కొత్త పాత నాయకుల మధ్య సమన్వయం కుదరని పని అన్నట్లుగా ఇప్పుడు గ్రామ స్థాయిలో నెలకొన్న రాజకీయాలు చూస్తుంటే అర్థమవుతోంది .ప్రస్తుతం వైసీపీలోకి నెలకొన్న గందరగోళం ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి వరంగా మారే విధంగా ఇప్పుడు పరిస్థితులు తయారయ్యాయి.