గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉండగా ఆ పార్టీ నేతలకు అధినేత చంద్రబాబు లోకేష్ లకు చుక్కలు చూపిస్తూ కోర్టు మెట్లు ఎక్కుతూ బాగా ఇబ్బంది పెట్టిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ నేతలను వదిలి పెట్టేలా కనిపించడం లేదు.ప్రస్తుతం ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి టీడీపీని మరింత ఇబ్బంది పెట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే మంగళగిరిలోని ఆత్మకూరు వద్ద నిర్మించిన టిడిపి నూతన భవనాన్ని కూల్చివేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ వేశారు.
గత ప్రభుత్వం సర్వేనెంబర్ 392 లోని 3.65 ఎకరాలను తొంభై తొమ్మిది సంవత్సరాలు లీజుకు ఇచ్చిందని, అయితే ఇది చట్ట విరుద్ధమంటూ ఎమ్మెల్యే ఆళ్ల తన పిటిషన్లో పేర్కొన్నారు.ఈ వ్యాజ్యం సోమవారం విచారణకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
చెరువులు నదీ పరివాహక ప్రాంతాల వద్ద భూముల కేటాయింపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తన పిటిషన్ ద్వారా గుర్తు చేశారు.ఇది చట్ట విరుద్ధం అంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు చేయడంతోపాటు టీడీపీ నూతన కార్యాలయాన్ని కూల్చి వేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ కోరారు.