ఏపీ సీఎం జగన్ క్షణం తీరిక లేనట్టుగా బిజీగా గడుపుతున్నారు.ఒక వైపు ప్రతిపక్షాలు అన్ని విషయాలను రాజకీయం చేసి, పైచేయి సాధిస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉండడంతో, పార్టీ వ్యవహారాలను ఆయన పెద్దగా పట్టించుకోలేక పోతున్నాడు.
మొత్తం పరిపాలన పైనే దృష్టి పెట్టి, ప్రజా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ, మరోసారి అధికారం దక్కించుకునేందుకు ఎటువంటి ఆటంకాలు లేకుండా, ప్రజల నుంచి జగన్ పరిపాలన పై ప్రశంసలు కురిసే విధంగా వ్యవహారాలు చేసుకుంటూ వస్తున్నారు.ఈ కారణంగానే పార్టీ వ్యవహారాలను జగన్ పూర్తిగా పక్కన పెట్టేసినట్టుగా కనిపిస్తున్నారు.
ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి కి అప్పగించారు.కోస్తా ప్రాంత బాధ్యతలు మొత్తం జగన్ చిన్నాన్న వైవి సుబ్బారెడ్డి చూస్తున్నారు.
ఇక రాయలసీమ జిల్లాల విషయానికొస్తే, ఇక్కడ బాధ్యతలు మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి చూస్తున్నారు.
ఈ విధంగా మూడు భాగాలుగా పార్టీని విభజించి, జగన్ తనపై ఒత్తిడి లేకుండా చేసుకున్నారు.
కాకపోతే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీల్లో మాత్రం తీవ్ర అసంతృప్తి నెలకొంది.గెలిచి ఏడాది పైగా అయినా, ఇప్పటి వరకు తమకు జగన్ అనుగ్రహం లభించలేదని, నియోజకవర్గ సమస్యలు ఎక్కువగా ఉండడంతో కలుద్దామని ప్రయత్నిస్తున్నా, సాధ్య పడడం లేదని, చాలామంది అనుమతులు తీసుకోవాల్సి వస్తుందని, ఇలా ఎన్నో రకాల అసంతృప్తులకు వారు గురవుతున్నారు.
జగన్ మాత్రం ఎవరిని నేరుగా కలిసేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు.ఏ వ్యవహారమైనా, పూర్తిగా సజ్జల రామకృష్ణారెడ్డి ద్వారానే చక్కబెడుతూ వస్తున్నారు.ఎవరైనా ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే ముందుగా ఆయనకు చెప్పుకుని, ఆయన దగ్గర పరిష్కారం కాకపోతే సజ్జాల సూచనతో వారు జగన్ ను కలిసే విధంగా వైసీపీలో పరిస్థితి ఉండడంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సొంత ప్రజాప్రతినిధులపై జగన్ ఈ విధంగా ఉండటం సరికాదని, నియోజకవర్గ సమస్యలతో ఇబ్బందులు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నా లాభం ఉండడం లేదని, వారు వాపోతున్నారు.
ఈ పరిస్థితి గురించి కొద్దిరోజుల క్రితమే నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సైతం అపాయింట్మెంట్ విషయమై సంచలన వ్యాఖ్యలు చేయడం, జగన్ అపాయింట్మెంట్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేసి, చివరకు ఆయన నేరుగా విమర్శలకు దిగడం వంటి ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.ప్రస్తుతం పార్టీలో పరిస్థితి అదే విధంగా ఉందని, ఆ పార్టీ నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయం జగన్ వద్దకు వెళ్ళినా, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీ వ్యవహారాలపై తాను పూర్తిగా దృష్టి పెట్టాలని జగన్ చెప్పేసి ఉండడంతో నాయకుల బాధలు వర్ణనాతీతం.
.