రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో కూడా ఊహించలే ని పరిస్థితి.
రాజకీయాల్లో ఏం జరిగినా.అప్పటికంతే.! అని సర్దు కోవడం తప్ప చేయాల్సింది ఏమీ ఉండదు.ఇలాంటి ఓ ఊహించని పరిణామమే తాజాగా రాజకీయాల్లో చోటు చేసుకుంది.కడప జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నేత, వైఎస్కు ప్రధాన శత్రువుగా పరిగణించబడిన ఎంవీ మైసూరా రెడ్డి.తనయుడు.
ఎంవీ హర్షవర్థన్ రెడ్డి.వైసీపీ తీర్థం పుచ్చుకున్నాడు.
నిజానికి ఎంవీ, వైఎస్ కుటుంబాలకు తీవ్ర స్థాయిలో శత్రుత్వం నడిచింది.వైఎస్ అంటే ఎంవీకి, ఎంవీ అంటే వైఎస్కు ఒక్క నిముషం కూడా పడేది కాదు.
ప్రతి విషయంలోనూ కారాలు మిరియాలు నూరుకున్నారు.అలాంటి కుటుంబం రాజకీయంగా పలు ఒడిదుడుకులు ఎదుర్కొంది.
ఈ క్రమంలోనే మైసూరా రెడ్డి తన అభిప్రాయ భేదాలను , వైరాలను కూడా పక్కన పెట్టి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.జగన్కు జై కొట్టారు.తండ్రికి శత్రువే అయినా కొడుకుకు మిత్రుడు అనే రీతిలో ఆయన వ్యవహరించారు.జగన్ కూడా వైసీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో ఎంవీని గౌరవించారు.అయితే, తర్వాత జగన్తోనూ ఎంవీ విభేదించారు.జగన్ను `సార్` అని పిలవాల్సి వస్తోందని, సీనియర్లకు ఆయన విలువ ఇవ్వడం లేదని, ప్రతి విషయంలోనూ తన నిర్ణయమే ఫైనల్ అంటున్నాడని, సీనియర్లమైన తమ సూచనలను, సలహాలను పట్టించుకోవడం లేదని కూడా ఎంవీ అప్పట్లోనే విమర్శించారు.
భారీ ఎత్తున మీడియాకు కూడా ఎక్కారు.దీంతో ఇరు వురి మధ్య విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి.
దీంతో మైసూరా రెడ్డి వైసీపీ నుంచి బయటకు వచ్చేశారు.తర్వాత ఆయన టీడీపీలో చేరతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా.ఇప్పటి వరకు మైసూరా అడ్రస్ కనిపించలేదు.అయితే, తాజాగా ఆయన కుమారుడు, డాక్టర్ హర్షవర్థన్ అనూహ్యంగా వైసీపీ తీర్థం పుచ్చుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
తన కుటుంబానికి బద్ధ శత్రువుగా పరిగణించే వైఎస్ తనయుడు జగన్ను ఆయన మెచ్చుకోవడం, కొనియాడడం కూడా విస్మయానికి గురి చేసింది.ఆయనతో పాటు నియోజక వర్గంలోని పలువురు నాయకులు, నేతలు, మరో వంద కుటుంబాలు ఎర్రగుంట్ల సమన్వయ కర్త సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలోవైసీపీలో చేరారు.
ఈ సందర్భంగా హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.వైఎస్ జగన్ గొప్ప నాయకుడని పేర్కొన్నారు.
తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు.ఈ పరిణామాలతో ఒక్కసారిగా రాజకీయ నేతలు ఉలిక్కి పడడం గమనార్హం.
టిక్కెట్ ఇస్తారా… ఇక మైసూరా వైసీపీ నుంచి బయటకు వచ్చారు.మరి ఇప్పుడు ఆయన కుమారుడు వైసీపీలో చేరడం వెనక వచ్చే ఎన్నికల్లో జిల్లాలే ఏదో ఒక సీటు నుంచి ఆయన అసెంబ్లీకి పోటీ చేయాలన్న కోరికే ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
అయితే ఆయన పార్టీలో చేరడానికి జగన్ ఏమీ ప్రత్యేకంగా సీటుపై హామీలు ఇవ్వకపోయినా పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని మాత్రం చెప్పినట్టు తెలుస్తోంది.