వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న కొన్ని కొన్ని పరిణామాలు ఆసక్తి కలిగించడంతో పాటు, వైసిపి రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన పెంచుతున్నాయి.అసలు ఎప్పుడూ లేని విధంగా ఆ పార్టీలో నెలకొన్న అలజడి ఎక్కడి వరకు వెళ్తుందో ? ఏ రాజకీయ పరిణామాల కు దారితీస్తుంది అనేది తెలియక ఆందోళన చెందుతున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది.అధికార పార్టీ అని గొప్పగా చెప్పుకునే అవకాశం లేకుండా పోయిందనే బాధ సదరు నాయకుల్లో ఎక్కువగా కనిపిస్తోంది.వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో పార్టీ నాయకులు అంతా యాక్టివ్ గా ఉంటూ , పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండేవారు.
అసలు పార్టీ కార్యక్రమాలలో పాల్గొనాలి అంటే ఎక్కడలేని ఉత్సాహం చూపించేవారు.జగన్ సైతం నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ , పార్టీ నాయకుల్లో ఉత్సాహం తీసుకువచ్చే విధంగా ఎప్పటికప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు.
జగన్ ఉత్సాహం చూసి పార్టీ నాయకులు సైతం మరింత ఉత్సాహంగా పని చేస్తూ, ఎక్కడికక్కడ ప్రజా సమస్యలపై దృష్టి పెడుతూ, నిత్యం మీడియా సమావేశాలు నిర్వహిస్తూ, అధికార పార్టీ టిడిపి పై తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు.జగన్ అభిప్రాయానికి అనుగుణంగా వ్యవహరిస్తూ, క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను హైలెట్ చేస్తూ , ఉండేవారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది.పార్టీ శ్రేణుల్లో నిరాశ, నిస్పృహలు తీవ్రంగా అలుముకున్నాయి.పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన తమను జగన్ పట్టించుకోవడంలేదనే అసంతృప్తి పార్టీ నాయకుల్లో ఎప్పటి నుంచో ఉంది.ఎమ్మెల్యేలు , ఎంపీలతో సైతం జగన్ అప్పాయింట్ మెంట్ ఇవ్వకపోవడం వారికి మరింత ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
జగన్ సైతం పూర్తిగా తన కార్యాలయానికి పరిమితమై పోవడం , పూర్తిగా అధికారులపైన ఆధారపడడం, పరిపాలన బాధ్యతలను అప్పగించడం, పార్టీ ప్రజాప్రతినిధుల ప్రమేయం లేకుండానే అన్ని పనులను చక్కబెడుతూ ఉండడం వంటి వ్యవహారాలు పార్టీ శ్రేణులకు ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి.
పరిస్థితి ముందు ముందు కూడా ఇదే విధంగా ఉంటే, రాబోయే ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే జగన్ కు నష్టం చేకూరుస్తారు అనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.
ప్రజలలో జగన్ పరిపాలన పై సానుకూలత ఉన్నా, పార్టీ నాయకుల్లో మాత్రం తీవ్ర ఆగ్రహావేశాలు కనిపిస్తుండటం తో, పరిస్థితి చేయి దాటిపోయే విధంగా కనిపిస్తోంది.