వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగన్ స్థాపించిన దగ్గర నుంచి, 2019 వరకు పడిన కష్టాలు అన్నీ, ఇన్నీ కావు.ఎన్నో ఆటు పోట్లను ఎదుర్కొని మరీ, పార్టీని పటిష్టం చేసే దిశగా జగన్ అడుగులు వేస్తూ వచ్చారు.
అప్పట్లో అధికార పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, టిడిపిలు ఎంతగా ఇబ్బందులకు గురిచేసినా, అన్నిటినీ తట్టుకుంటూనే జగన్ వచ్చారు.ఈ క్రమంలో 16 నెలల పాటు జగన్ జైలు జీవితం కూడా గడిపారు.
ఇక ఆ సమయంలో జగన్ కు అండదండగా ఎంతో మంది పార్టీ నాయకులు నిలిచారు.అధికార పార్టీ వేధింపులు, కేసులు అంటూ భయపెట్టే ప్రయత్నం చేసినా, వారంతా పార్టీని పటిష్టం చేసే దిశగా కృషి చేశారు.
మధ్యలోనే కొంతమంది అధికార పార్టీ లోకి వెళ్ళినా, మెజారిటీ నాయకులు మాత్రం జగన్ పై నమ్మకంతో ఆయన వెన్నంటే నడిచారు.అందరి కృషి ఫలితంగా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని మట్టికరిపించి, అఖండ మెజారిటీతో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
దీంతో తమకు జగన్ సరైన ప్రాధాన్యత ఇస్తారని, ఇప్పటి వరకు తాము పడ్డ కష్టాలు అన్ని తీరిపోతాయి అని, నాయకులంతా భావించగా, మొదట్లో జగన్ కూడా ఆ విధంగానే వ్యవహరించారు.కానీ ఆ తర్వాత జగన్ వైఖరిలో పూర్తిగా మార్పు వచ్చినట్లుగా కనిపించింది.
తెలుగుదేశం పార్టీని బలహీనం చేయాలంటే, ఆ పార్టీ నుంచి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించాలని భావించి, వలసలకు గేట్లు తెరవడంతో, పెద్దఎత్తున టిడిపి నాయకులు వైసీపీ లోకి క్యూ కట్టారు.దీంతో ఇప్పుడు నియోజకవర్గాల్లో పార్టీ నాయకుల మధ్య గ్రూపు రాజకీయాలు పెరిగిపోయాయి.
ముఖ్యంగా టిడిపి నుంచి వైసిపి వైపు వచ్చిన ఎమ్మెల్యేలు వైసిపిలో తగిన ప్రాధాన్యత పొందుతూ వుండడంతో, మొదటి నుంచి వైసీపీ కోసం కష్టపడిన నాయకుల్లో తీవ్ర అసంతృప్తి పెరిగిపోతోంది.
ప్రస్తుతం వారు టిడిపి ఎమ్మెల్యేలు గానే కొనసాగుతున్నప్పటికీ, జగన్ వారికి అన్ని విషయాల్లోనూ స్వేచ్ఛ ఇవ్వడం, పూర్తిగా ప్రాధాన్యత ఇవ్వడం వంటి కారణాలతో మొదటి నుంచి పార్టీకోసం కష్టపడే వారికి ప్రాధాన్యం లేకుండా అయిపోయింది అనే బాధ మొదటి నుంచి వైసీపీలో ఉన్న నాయకుల్లో మొదలైంది.
దీనికితోడు ఎక్కడికక్కడ కొత్తగా చేరిన నాయకులు కారణంగా చోటుచేసుకుంటున్న వివాదాలు అన్నీ ఇన్ని కావు.విశాఖ జిల్లాలో కానీ, గన్నవరం నియోజకవర్గంలో కానీ , ఎక్కడ చూసినా మొదటి నుంచి వైసీపీ నమ్ముకున్న నాయకుల్లో అసంతృప్తి కట్టలు తెంచుకుంటోంది.
జగన్, చంద్రబాబు బాటలోనే నడుస్తూ తమకు తీరని అన్యాయం చేస్తున్నారనే బాధ నాయకుల్లో పెరిగిపోతూ వైసిపి దెబ్బతీసే విధంగా తయారయ్యింది.ప్రజా సంక్షేమ విషయాల్లో ప్రభుత్వ ప్రతిష్టను పెంచే కార్యక్రమాలను ఇప్పుడు పట్టించుకోకుండా, నాయకులు ఎవరికి వారు ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా పార్టీ అధిష్టానం ఇవన్నీ సర్వసాధారణమైన విషయాలే అని, అవే సర్దుకుంటాయిలే అన్నట్టుగా వ్యవహరిస్తుండడం మొదటికే మోసం వచ్చేలా తయారైంది.ఇదే అదనుగా టిడిపి జనాల్లో బలం పెంచుకుంటూ పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
నాయకుల్లో అసంతృప్తులు, గ్రూపు రాజకీయాలు పెరిగిపోకముందే జగన్ సదరు నాయకులను బుజ్జగించే విధంగానో, వారికి ప్రాధాన్యత పెంచే విధంగానో ఏదో ఒక నిర్ణయం వీలైనంత తొందరగా తీసుకోకపోతే, నాయకుల్లో అసంతృప్తి జ్వాలలు మరింతగా ముదిరిపోయే అవకాశం లేకపోలేదు అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.