రాజకీయాలు ఎప్పుడూ రంజుగానే ఉంటాయి.ఇక్కడ స్నేహం, శత్రుత్వం ఏదైనా అవసరాల మేరకు ఉంటుంది.
ఎవరి అవసరం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు.అకస్మాత్తుగా శత్రువులు మిత్రులు, మిత్రులు శత్రువులు అవుతారు.
ఇదంతా రాజకీయాల్లో షరా మామూలు వ్యవహారమే.ప్రస్తుతం ఏపీ రాజకీయాలనే చూసుకుంటే అధికార పార్టీ వైసీపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ పోటాపోటీగా రాజకీయాలు చేస్తున్నాయి.
ఈ రెండు పార్టీలతో కేంద్ర అధికార పార్టీ బిజెపి వ్యవహరిస్తున్న తీరుతో అసలు బిజెపి, టిడిపి, వైసిపిలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నాయి అనే విషయం ఎవరికీ అర్థం కావడం లేదు.వైసిపి ఏపీలో అధికారంలోకి రావడానికి తగిన సహాయం బిజెపి అందించింది.
దీనికి కారణం అంతకుముందు టిడిపి, బిజెపి పొత్తు ఉన్న సమయంలో ఆకస్మాత్తుగా పొత్తు రద్దు చేసుకుని బీజేపీ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది టిడిపి.ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత జీవితంపైనా విమర్శలు చేయడం, అమిత్ షా తిరుపతి వచ్చిన సందర్భంలో ఆయన కారుపై రాళ్ల దాడికి పాల్పడ్డారు.
ఇలా ఎన్నో వ్యవహారాలు చోటుచేసుకోవడంతో టిడిపిని దెబ్బకొట్టేందుకు బిజెపి వైసిపి కి సహకరించింది.పోనీ అధికారంలోకి వచ్చిన వైసీపీతో బీజేపీ సఖ్యతగ ఉంటుందా అంటే అదీ లేదు.
చాలా సందర్భాల్లో వైసిపీ ని పక్కన పెడుతూ, జగన్ కు సైతం అపాయింట్మెంట్ నిరాకరిస్తూ, కేంద్ర బిజెపి పెద్దలు వ్యవహరిస్తున్న తీరు ఎవరికీ అర్థం కాకుండా ఉంది.అలాగే టీడీపీ ని మళ్లీ దగ్గర చేసుకుంటాము అన్న రీతిలో బిజెపి పెద్దలు వ్యవహరిస్తున్నారు.
తాజాగా వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఈ వ్యవహారం పై విమర్శలు చేశారు.చంద్రబాబు బీజేపీ పెద్దలతో రహస్య పొత్తు కొనసాగిస్తాడు అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేయడం వెనక చాలా కథ ఉంది అనే అనుమానాలు కలుగుతున్నాయి.
ప్రస్తుతం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసేందుకు బిజెపి ప్రభుత్వం నిర్ణయించింది.దీనిపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నా, అటు టిడిపి కానీ, ఇటు వైసిపి కానీ ఘాటుగా బిజెపిపై విమర్శలు చేయలేకపోతున్నాయి.బిజెపి వైసీపీ మధ్య కాస్తో కూస్తో పొత్తు ఉన్న కారణంగా ఆ పార్టీ విమర్శలు చేయలేకపోతుంది అనుకుంటున్నా, టిడిపి సైతం ఇదే ధోరణి తో ఉంది.అలాగే తెలుగుదేశం పార్టీ ఎంపీలకు బిజెపి పెద్దలు అపాయింట్ మెంట్ ఇవ్వడం వంటి వ్యవహారాలతో మళ్ళీ బిజెపి టిడిపి మధ్య పొత్తు కుదురుతుందా అనే అనుమానాలు ఇప్పుడు వైసీపీలోకి కలుగుతున్నాయి.
ఈ వ్యవహారం తో వైసీపీలో తీవ్ర ఆందోళన నెలకొంది.ఈ పరిణామాలతో టిడిపి లో ఉత్సాహం కనిపిస్తున్న, వైసిపిలో ఆందోళన కనిపిస్తోంది.కానీ ఈ రెండు పార్టీలను అడ్డం పెట్టుకుని బీజేపీ ఏపీలో రాజకీయ పబ్బం గడుపుకుంటున్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది.