ఎప్పటికప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటూ సంచలనం సృష్టించడం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ కు మామూలుగా వవహారమే.ఎవరి ఊహకు అందని నిర్ణయాలు తీసుకోవడంలో ఎప్పుడూ జగన్ ముందుంటారు.
ఇప్పుడు అటువంటి నిర్ణయమే జగన్ తీసుకున్నారు.అది కూడా తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల విషయంలో ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సంగతి తెలిసిందే.
బీజేపీ జనసేన కూటమి కలిసి ఇక్కడ గెలవాలనే పట్టుదలతో ఉంది.టీడీపికి ఇక్కడ బలం లేకపోయినా , వైసీపీని ఓడించడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తోంది.
వైసీపీకి ఈ స్థానం తమ ఖాతాలోనే పడుతుంది అని, తామే గెలుస్తామని ఆ పార్టీ ధీమా లో ఉంది.మెజారిటీ పైనే లెక్కలు వేసుకుంటున్నారు.
అలాగే తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా మెజార్టీ పై ఎమ్మెల్యే లకు టార్గెట్ విధించారు.దీంతో ఎక్కడికక్కడ పార్టీ నేతలు అలర్ట్ అయ్యారు.
వైసీపీ అభ్యర్థి గురుమూర్తి కి భారీ మెజార్టీ తెచ్చేందుకు కృషి చేస్తున్నారు.అసలు ఎన్నికలు అంటే డబ్బు పంపిణీ అనేది సర్వసాధారణమైన విషయం.
అన్ని రాజకీయ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రహస్యంగా డబ్బు పంపిణీ చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది.అయితే ఇప్పుడు జగన్ మాత్రం ఆ ఆనవాయితీని మార్చాలని, తిరుపతి లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఎక్కడా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయకూడదు అని నిర్ణయించుకున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఈ వ్యవహారం వైసీపీ నేతలకు తీవ్ర భయాందోళనలు కలిగిస్తున్నాయి.సాధారణంగా అధికారపార్టీ అంటేనే డబ్బు విచ్చలవిడిగా పంపిణీ చేస్తుందని, ప్రతిపక్షాల కంటే ఎక్కువ స్థాయిలో డబ్బు పంపిణీ చేపడుతుంది అని ఆశగా ఎదురు చూస్తారు.
కానీ ఇప్పుడు డబ్బు పంపిణీ చేయకపోతే ఓటర్లు నిరాశ చెంది , ఇతర పార్టీల వైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని వైసిపి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు ఆందోళన చెందుతూ ఉండగా, జగన్ మాత్రం ఇప్పటివరకు ప్రభుత్వం తరఫున అనేక సంక్షేమ పథకాలు అందించాము అని ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి అమలు చేయని స్థాయిలో ప్రజా సంక్షేమ పథకాలను అమలుచేసి చూపిస్తున్నాం అని, అయినా డబ్బులు ఎందుకు పంపిణీ చేయాలని, అసలు తమ ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది అనేదానికి ఈ ఎన్నికలను రెఫరెండం గా చూడాలని , అందుకే డబ్బు పంపిణీ చేయకుండా, ప్రజలు తమ ప్రభుత్వ విషయంలో ఏ విధంగా ఆలోచిస్తున్నారనే విషయం తెలుసుకునేందుకు జగన్ ఈ నిర్ణయానికి వచ్చారట.జగన్ నిర్ణయంతో ప్రతిపక్షాలు ఆనందంగా కనిపిస్తున్నాయి.ఖచ్చితంగా ఈ నిర్ణయం తమకు లబ్ధి చేకూరుస్తుందనే ఆశలో ఉన్నారు.