మొన్నీమధ్యనే టిడిపి గురించి, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురించి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు ఓ ప్రైవేట్ హోటల్లో మాట్లాడిన మాటలు పెద్ద సంచలనమే సృష్టించాయి.17 తర్వాత పార్టీ ఉండదని, అసలు లోకేష్ సరిగా ఉంటే పార్టీకి ఈ దుస్థితి ఎందుకు వచ్చేది అంటూ అచ్చెన్న మాట్లాడిన మాటలు వైసిపి బాగా హైలెట్ చేసింది.సరిగ్గా ఇప్పుడు అదే రీతిలో వైసిపి ఎంపీలు , కీలక నాయకుల మధ్య జరిగిన ఓ ప్రైవేటు సంభాషణలో కరోనా విషయంలో జగన్ చేతులెత్తేశారు అని, ఎవరైనా కరోనా తో చనిపోతే పేద కుటుంబాలు డొనేషన్స్ కోసం అడుక్కుంటున్నారు అంటూ మాట్లాడిన మాటలు వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో లో వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్, రాజమండ్రి వైసీపీ ఇంఛార్జి ఆకుల సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
కరోనా కారణంగా ప్రభుత్వం నిస్సహాయంగా మారిపోవడం వల్ల పేద ప్రజలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు అంటూ సదరు నేతల మధ్య చర్చ జరిగింది.ఎవరైనా కరోనా తో మృతి చెందితే ఆ మృతదేహాన్ని తరలించేందుకు 30 వేలు, అంత్యక్రియలకు 12 వేలు వసూలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
కానీ ప్రభుత్వం ఎటువంటి సాయం చేయడం లేదని వారి మధ్య జరిగిన సంభాషణ.ఈ వీడియో బయటకు రావడం కలకలం రేపింది.
రాజమండ్రి లో రెండు రోజుల క్రితం అంతిమయాత్ర వాహనాన్ని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో రాజమండ్రి ఎంపీ భరత్ తో పాటు రాజమండ్రి వైసీపీ ఇన్చార్జి ఆకుల సత్యనారాయణ మరి కొంతమంది నాయకులు హాజరయ్యారు.ఈ సమావేశానికి ముందు జగన్ పరిపాలన తీరుపై వీరు మాట్లాడినట్టు గా బయటకి వచ్చిన మాటలు ఇప్పుడు పెద్ద సంచలనమే సృష్టిస్తున్నాయి.ఈ వీడియో ఎలా బయటకు వచ్చింది అనే విషయం తెలియకపోయినా, జగన్ విషయంలో ఆయనకు అత్యంత సన్నిహితులైన పిల్లి సుభాష్ చంద్రబోస్ సైతం ఈ వీడియోలో ఉండడం తో, జగన్ ఈ విషయాన్ని ఆషామాషీగా వదిలిపెట్టరు అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ.
అసలు ఈ వీడియో నిజమైనదా కాదా ? ఎవరైనా మార్ఫింగ్ చేశారా ? అసలు ఈ తతంగం ఎలా బయటకి వచ్చింది ఇలా అనేక అంశాలపై అంతర్గతంగా వైసీపీ విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది.