జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా , అది పెద్ద సంచలనమే అవుతూ, సంచలనాలకు కేంద్రంగా మారుతూ వస్తోంది.2019లో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ ఇదే కంటిన్యూ అవుతూ వస్తోంది.గతంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోని, అమలు చేయని నిర్ణయాలు అన్ని జగన్ చేసి చూపిస్తున్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు.జగన్ పాలనపై జనాల్లో సంతృప్తి బాగా కనిపిస్తోంది.బడుగు, బలహీన వర్గాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తూ, పార్టీ, ప్రభుత్వ పదవుల్లోనూ, వారికే పెద్ద పెద్ద పీట వేస్తూ వస్తున్నారు.
అయితే క్రమక్రమంగా జగన్ నిర్ణయాలు పార్టీ జనాల్లో తీవ్ర అసంతృప్తిని రాజేస్తున్నాయి.మొదటి నుంచి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న వారికి కాకుండా, సామాజిక వర్గాల సమతూకం అంటూ జనాలకు పెద్దగా పరిచయం, గుర్తింపు లేని నాయకులకు పదవుల్లో ప్రాధాన్యం ఇస్తూ, తమ ప్రాధాన్యం తగ్గిస్తూ ఉండడంతో మొదటి నుంచి వైసిపి కోసం కష్టపడిన నాయకులు తీవ్ర అసంతృప్తికి గురి అవుతున్నారు.
పార్టీ కోసం అహర్నిశలు కృషి చేయడంతో పాటు, ఆర్థికంగానూ నష్టపోయామని, జగన్ తమ కష్టాన్ని గుర్తించి పదవుల్లో ప్రాధాన్యం కల్పిస్తారని భావించామని, కానీ ఇప్పుడు సామాజిక వర్గాల పేరుతో పార్టీ నేతలకు, ప్రజలకు పెద్దగా పరిచయం లేని వ్యక్తులకు పెద్దపీట వేస్తున్నారు అంటూ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు.ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్, మేయర్, చైర్మన్ ల ఎంపిక దాదాపు పూర్తయ్యి ప్రమాణ స్వీకారాలు జరిగిపోయాయి.
ఈ మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ అభ్యర్థులుగా రంగంలోకి దిగిన వారిని కాదని, ఇప్పుడు గెలిచిన కార్పొరేటర్లు, వార్డు కౌన్సిలర్ లలో కొత్తవారిని, పెద్దగా ప్రజాబలం లేనివారిని తీసుకొచ్చి చైర్మన్ లుగానూ, మేయర్ లాగానూ అవకాశం కల్పిస్తూ ఉండటంపై తీవ్ర ఆవేదన చెందుతున్నారు.
పార్టీ క్యాడర్ లో పలుకుబడి ఎక్కువగా ఉన్న నాయకులకు పదవులు ఇస్తే, వారు పార్టీని మరింత బలోపేతం చేస్తారని, రాబోయే ఎన్నికల్లోనూ ఆర్థికంగా అండదండలు అందించి మళ్లీ వైసీపీ గెలుపుకి ధోఖా లేకుండా చూసుకునే వారని, ఇప్పుడు కొత్త వారికి, వాక్చాతుర్యం లేని వారికి పదవులు ఇవ్వడం వల్ల కలిసొచ్చేది ఏమిటనే ప్రశ్న వ్యక్తమవుతోంది.జగన్ వ్యూహాత్మకంగానే ఈ సామాజిక వర్గాల లెక్కలు వేసుకున్నా, నాయకుల్లో ఎక్కడలేని అసంతృప్తిని రాజేస్తూ ఈ పరిణామాలు మంట పుట్టిస్తున్నాయి.