వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతా బాగానే ఉంది అనుకుంటున్నా, లోలోపల మాత్రం ఎన్నో అసంతృప్తులు, వివాదాలు, నాయకుల మధ్య సమన్వయ లోపం ఇలా ఎన్నో ఇబ్బందులు ఆ పార్టీలోని నాయకులు ఎదుర్కొంటున్నారు.అధికార పార్టీ అనే దర్పంతో ఎక్కడికక్కడ నాయకులు ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించడం వంటి కారణాలతో ప్రోటోకాల్ సమస్యలు తలెత్తడం, ఆ విభేదాలు తీవ్రస్థాయికి చేరడం వంటివి గత కొంతకాలంగా చోటుచేసుకుంటున్నాయి.
ఇటువంటి వ్యవహారాలపై జగన్ సీరియస్ గానే స్పందిస్తూ, ఎప్పటికప్పుడు పార్టీ నాయకుల ద్వారా ఈ వివాదాలు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నా, అవి యథాతథంగానే ఇవి చోటు చేసుకుంటూ వస్తున్నాయి.
అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా, ప్రతి నియోజకవర్గంలోనూ, నాయకుల మధ్య ఇదే రకమైన వివాదాలు చోటు చేసుకుంటూనే వస్తున్నాయి.
కొంతమంది నాయకులకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు జగన్ వార్నింగ్ లు ఇచ్చినా, పరిస్థితిలో ఏ మాత్రం మార్పు కనిపించకపోవడంతో, పార్టీపై జగన్ పట్టు కోల్పోతున్నారా అనే అనుమానాలు ఇప్పుడు అందరిలోనూ తలెత్తుతున్నాయి.గన్నవరం నియోజకవర్గంలో వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకట్రావు మధ్య ఉన్న విబేధాలను దృష్టిలో పెట్టుకుని జగన్ వారిద్దరి చేతిలో చేయి వేసి మరీ రాజీ కుదిర్చినా, పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదని, పార్టీ శ్రేణులే అంగీకరిస్తున్నాయి.
ఎవరికి వారు ఆధిపత్యం చేలాయించేందుకు ప్రయత్నించడం వంటి ఎన్నో కారణాలతో వైసీపీ మరెన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది.చిలకలూరిపేట విషయానికి వస్తే, స్థానిక ఎమ్మెల్యే విడుదల రజిని, ఎంపీ లావు కృష్ణదేవరాయల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది.అలాగే ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఆమంచి కృష్ణ మోహన్, ఎమ్మెల్యే కరణం బలరాం మధ్య ఆధిపత్య పోరు తీవ్రంగా ఉంది.రెండు వర్గాలకు అస్సలు పొసగని పరిస్థితి ఇక్కడ నెలకొంది.
అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, టీడీపీ నుంచి వైసీపీలోకి చేయడంతో అక్కడ కూడా ఇదే రకమైన పరిస్థితి నెలకొంది.
కొత్తగా చేరిన వారిని కలుపుకుని వెళ్లేందుకు వైసిపి సీనియర్ నాయకులు ఎవరూ పెద్దగా ఇష్టపడకపోవడం వంటి కారణాలతో రకరకాల ఇబ్బందులను ఆయన ఎదుర్కోవలసి వస్తుంది.
ఇలా చెప్పుకుంటూ వెళితే, ప్రతి నియోజకవర్గంలోనూ దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది.ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని హెచ్చరికలు చేసినా, ఆ పార్టీ నేతల్లో మార్పు రాకపోవడంతో, జగన్ సైతం ఏ విధంగా ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కాలో తెలియని సందిగ్ధంలో ఉన్నారట.