బిజెపి శరవేగంగా రాజకీయ వ్యూహాలను మారుస్తోంది.ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ కి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి.
దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.తగిలేలా ఉన్నాయి.
ఇప్పటికే అనేక ప్రాంతీయ పార్టీలు బిజెపి కి దూరం అయ్యాయి.ధరల పెరుగుదల, పెట్రోల్ డీజిల్ పెరుగుదల, ప్రైవేటీకరణ విషయంలో బీజేపీ తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
అందుకే బలమైన ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.ముఖ్యంగా ఏపీ విషయాని కే వస్తే ఇక్కడ జనసేన పార్టీతో బిజెపి పొత్తు కొనసాగిస్తోంది.
కానీ ఈ విషయంలో రెండు పార్టీలకు మధ్య అంతగా సఖ్యత లేదు.అదీ కాకుండా క్షేత్రస్థాయిలో బలం జనసేన కు లేకపోవడం, రాబోయే ఎన్నికల్లోనూ ఆ పార్టీ అధికారంలోకి వచ్చే అంతటి శక్తి సామర్ధ్యాలు కూడగట్టుకోకపోవడం వంటివి బీజేపీని ఆలోచనలో పడేస్తున్నాయి.
అందుకే బలహీనంగా ఉన్న జనసేన పార్టీ కంటే బలమైన వైసీపీతో పొత్తు పెట్టుకుంటేనే రాబోయే ఎన్నికల తర్వాత కూడా మళ్లీ కేంద్రంలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని, దానికి అవసరమైన ఎంపీల మద్దతు ఉంటుందని బీజేపీ అగ్రనేతలు ఆలోచిస్తున్నారట.
అందుకే ఎన్డీఏలోకి వైసీపీని తీసుకోవాలని మంత్రివర్గంలోనూ వైసీపీకి రెండు, మూడు కీలక మంత్రిత్వశాఖను అప్పగించి, రాబోయే రోజుల్లో మళ్ళీ బిజెపి ప్రభుత్వం ఏర్పడేలా చూసుకోవాలనే ఆలోచనలో ఉందట.
అయితే ఈ ప్రతిపాదన ఇప్పటిది కాదు.వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఎన్డీయేలోకి వైసిపి వచ్చి చేరుతుందని అంతా అంచనా వేశారు.కానీ జగన్ మాత్రం ఎన్డీఏ లో చేరేందుకు ఇష్టపడలేదు.ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టుకు నిధులు వంటివి కేంద్రం తక్షణమే అమలు చేస్తేనే తాము చేరుతాము అనే మెలిక పెట్టడంతో అప్పట్లో బిజెపి వెనుకడుగు వేసింది.
కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బిజెపికి వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ఏదో రకంగా వైసీపీని ఎన్డీఏలో చేర్చుకోవాలనే ఆలోచనలు బీజేపీ పెద్దలు ఉన్నట్టు సమాచారం.ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ తో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.
ఈ ఎన్నికల్లో అసొం తప్ప మిగతా రాష్ట్రాల్లో బిజెపి ప్రభావం అంతంత మాత్రంగా ఉండే అవకాశం కనిపిస్తుండడంతో, దేశవ్యాప్తంగా ఉన్న బలమైన ప్రాంతీయ పార్టీలను దగ్గర చేసుకునే ఆలోచనతో బిజెపి అడుగులు వేస్తోంది.బిజెపి పెద్దలు ఒత్తిడితో జగన్ వివిధ షరతులతో వైసిపిని ఎన్డీఏలో చేర్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని, లేకపోతే టీడీపీ కి ఆ ఛాన్స్ దక్కుతుంది అనే భయమూ ఉండడంతో ఎన్డీయేలో వైసీపీ చేరే అవకాశం ఉన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.