నరసాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు.సొంత పార్టీ పైన , పార్టీ అధినేత జగన్ పైన ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు.
ప్రభుత్వంలో నెలకొన్న అనేక తప్పిదాలను హైలెట్ చేస్తూ మీడియా ముందుకు వచ్చి బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు.అక్కడితో ఆగకుండా సొంత పార్టీ నేతల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలంటూ ఆయన హడావుడి చేయడంతో పాటు, లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వంలో నెలకొన్న సమస్యలను, తప్పిదాలను నేరుగా జగన్ కు చెప్పేందుకు ప్రయత్నిస్తున్న ఆయన అపాయింట్మెంట్ దొరకడం లేదని, అందుకే మీడియా ముందుకు వచ్చి అన్ని విషయాలు చెబుతున్నాను అంటూ, ఇందులో తన తప్పు ఏమీ లేదు అంటూ రఘురామకృష్ణంరాజు చెప్పుకుంటూ వస్తున్నారు.
ఆయనే కాకుండా మరికొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు జగన్ తీరు ను ఇదేవిధంగా తప్పుపడుతూ వస్తున్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో జగన్ పెద్దగా ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వలేదు.పూర్తిగా సంక్షేమ పథకాలపై దృష్టి పెట్టి పార్టీ వ్యవహారాలను పెద్దగా పట్టించుకోనట్లు గా కనిపించారు.
కానీ ఈ వ్యవహారం పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడం తో పాటు, సొంత పార్టీ నేతల్లో అసంతృప్తి తీవ్రస్థాయిలో పెరిగిపోయి పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తుందనే ఉద్దేశంతో ఉన్న జగన్, ఇటువంటి విమర్శలకు ఇకపై తావు ఇవ్వకుండా, ఎమ్మెల్యేలు, ఎంపీలకు అపాయింట్మెంట్ ఇస్తున్నట్లుగా తెలుస్తోంది .
తాజాగా ఎమ్మెల్యేలు కోలగట్ల వీరభద్రస్వామి , సాయిప్రసాద్రెడ్డి , బాలనాగిరెడ్డి, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సహ మరికొంతమందికి అపాయింట్మెంట్లు ఇవ్వడం, వారితో అన్ని విషయాలు మాట్లాడడం, వారు అడిగిన పనులకు నిధులు మంజూరు చేయడం వంటి ఎన్నో ఇప్పుడు చోటుచేసుకోవడంతో ఎమ్మెల్యేల్లో కాస్త ఉత్సాహం కనిపిస్తోంది.ఇప్పటి వరకు జగన్ ను కలిసేందుకు తాము ఎన్నో ఇబ్బందులు పడ్డామని, ఆయన ఎవరికి ఆయన అపాయింట్మెంట్ ఇచ్చేవారు కాదని, ఇప్పుడు రఘురామకృష్ణంరాజు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత జగన్ లో మార్పు కనిపిస్తోందని వైసీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు వ్యాఖ్యానిస్తున్నారు.మొత్తానికి రాజుగారి స్ట్రోక్ జగన్ కు గట్టిగానే తగిలినట్టుగా కనిపిస్తోంది.