అనుకున్నదంతా అయ్యింది.మొదటి నుంచి ఊహించినట్టుగానే ఏపీలో వైసీపీ గాలి బలంగా వీస్తోంది.
గెలుస్తామంటూ బలంగా చెప్పుకొచ్చిన టీడీపీ ఇప్పుడు పూర్తిగా సైలెంట్ అయిపొయింది.ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ధీమాగా చెప్పుకొచ్చి దాదాపు 130 స్థానాల్లో విజయం సాధిస్తామని చెప్పిన టీడీపీకి ఇప్పుడు కనీసం 30 సీట్లు కూడా వచ్చే అవకాశం కనిపించడంలేదు.
కొద్ది రోజుల క్రితం ఎగ్జిట్ పోల్స్ చెప్పిన రిజల్ట్స్ ప్రకారం సైకిల్ కుదేలయింది.గతంకంటే పుంజుకుని ఇప్పడు ఫ్యాన్ పార్టీ ఫుల్ స్పీడ్ గా తిరుగుతోంది.
పోలింగ్ ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ అనేకం బయటకి వచ్చాయి.ముందుగా ప్రారంభించిన పోస్టల్ బ్యాలెట్లలోనూ వైసీపీ పూర్తి ఆధిక్యత కనబడింది.
ఇక కేంద్రంలోనూ ఎగ్జిట్ పోల్స్ చెప్పిన ప్రకారమే కేంద్రంలోనూ ఎన్డీయే తన హవా చూపిస్తోంది.స్పష్టమైన మెజార్టీతో మోదీ ప్రభుత్వం మరోసారి అధికారం దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.అలాగే ఏపీ విషయాన్ని చూసుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీదే హవా అని వివిధ వార్తా సంస్థల సర్వేలు తేల్చి చెప్పాయి.ఇండియాటుడే –మై మాక్సిస్ ఎగ్జిట్ పోల్ ప్రకారం వైసీపీకి 18 నుంచి 20 ఎంపీ సీట్లు దక్కే అవకాశం కనిపిస్తోంది.
లగడపాటి సర్వే మినహా మిగతా సర్వేలన్నీ దాదాపు నిజమవుతున్నాయి.ప్రస్తుత పరిస్థితిని బట్టి లగడపాటి సర్వే సంస్థకు ఉన్న విశ్వసనీయత కోల్పోయినట్టయ్యింది.ఉత్కంఠభరితంగా జరుగుతున్న ఓట్ల లెక్కింపులో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఆధిక్యంలో కనిపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 13 జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో 36 కేంద్రాల్లో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.మరోవైపు అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి కౌంటింగ్ కేంద్రాల సన్నద్ధతపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది సమీక్షిస్తున్నారు.కౌంటింగ్ కేంద్రాల నుంచి సమాచారం తెలుసుకోవటంతో పాటు అక్కడి సమస్యలను పరిష్కారం చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఇక ప్రజల విషయానికి వస్తే మొత్తం టీవీలకే పరిమితమయ్యి ఎప్పటికప్పుడు కౌంటింగ్ అప్డేట్స్ మీద చర్చలు చేసుకుంటున్నారు.కొన్ని జిల్లాల్లో వైసీపీ మొత్తం క్లిన్ స్వీప్ చేసేలా కనిపిస్తుంది.
జనసేన ఒక్క సీటు మెజార్టీతో కనిపిస్తుంది.