అచ్చెన్నాయుడు జైలులో ఉన్నన్ని రోజులు కింజరాపు ఫ్యామిలీ టీడీపీని వీడుతుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.రామ్మోహన్ నాయుడు బీజేపీకి టచ్లో ఉన్నారని, తన బాబాయ్ కోసం ఆయన టీడీపీని వీడబోతున్నారని వార్తలు వచ్చాయి.
అయితే అచ్చెన్న జైలులో ఉన్న సమయంలో రామ్మోహన్ కూడా కాస్త సైలెంట్గా ఉండటంతో, ఈ వార్తల విషయంలో తెలుగు తమ్ముళ్ళు కూడా కాస్త కంగారు పడ్డారు.అయితే అచ్చెన్న జైలు నుంచి వచ్చాక రామ్మోహన్ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు.
పైగా పార్లమెంట్ సమావేశాలు కూడా మొదలు కావడంతో రామ్మోహన్ దూకుడు పెంచారు.
లోక్సభలో తనదైన శైలిలో గళం విప్పుతూనే, మీడియా ముందు అధికార వైసీపీపై విరుచుకుపడుతున్నారు.
లోక్సభలో వైసీపీ ఎంపీలు చేస్తున్న ఆరోపణలకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు.ఇటీవల అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
అలాగే దీనిపై సిబిఐ విచారణ జరిపించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.ఎంపీ మిథున్ రెడ్డి కూడా అమరావతి దేశంలో పెద్ద భూ కుంభకోణం అని, దానిపై సిబిఐ వేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు, లోకేష్లు కూడా సిబిఐ కావాలని కోరాలని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.
ఈ క్రమంలోనే రామ్మోహన్ లైన్లోకి వచ్చి, ముందు బెయిల్ మీద బయట ఉన్న జగన్పై ఉన్న కేసులు వేగంగా పూర్తి చేయాలని కోరాలని వైసీపీ నేతలకు చురకలు అంటించారు.
ఇక 16నెలల వైసీపీ పాలనలో అవినీతి, ఇళ్ల స్థలాలకు భూసేకరణలో జరిగిన అక్రమాలు, మద్యం, ఇసుక, లేటరైట్, గ్రానైట్ మైనింగ్ మాఫియా కుంభకోణాలపై సీబీఐ విచారణ కోరాలన్నారు.
అయితే కరెక్ట్ టైమ్లో లైన్లోకి వైసీపీకి గట్టి కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు.
రామ్మోహన్ చెప్పినట్లు వైసీపీ ప్రభుత్వానికి ధైర్యం ఉంటే వీటిపై సిబిఐ కోరాలని తెలుగు తమ్ముళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు.పైగా కింజరాపు ఫ్యామిలీ పార్టీ మారిపోతుందని ప్రచారం చేసిన వారికి కూడా రామ్మోహన్ చెక్ పెట్టడంతో పాటు జగన్ కేసుల విచారణ అంశం తెరమీదకు తేవడంతో వైసీపీ వాళ్లను భలే ఇరకాటంలో పడేశారన్న టాక్ ఏపీ రాజకీయాల్లో హైలెట్ అయ్యింది.