ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గెలుపు ధీమా ఎక్కువగా కనిపిస్తోంది.కింది స్థాయి కార్యకర్త నుంచి జగన్ వరకు అంతా తమదే అధికారం అన్న ధీమా కనిపిస్తోంది.
దీనంతటికి కారణం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువగా పోల్ అవ్వడమే అని తెలుస్తోంది.వైసీపీ కూడా ఏపీలోని ప్రతి నియోజకవర్గం నుంచి బూత్ ల వారీగా నివేదికలను తెప్పించుకుని పరిశీలించిన తరువాత చెబుతున్నమాట.
పోలింగ్ చివరి నిమిషంలో పడిన ఓట్లు కూడా తమకు అనుకూలంగానే వచ్చినట్టుగా వైసీపీ చెబుతోంది.అంతేకాదు మహిళా ఓటర్లు కూడా తమకే మద్దతు పలికారని వైసీపీ లెక్కలతో సహా చెప్తూ ధీమా వ్యక్తం చేస్తోంది.
అంతే కాదు ఒకడుగు ముందుకు వేసి మరీ మే 23 వ తేదీన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు.2014 ఎన్నికల్లో తమను దెబ్బతీసిన ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు కోస్తా జిల్లాల్లో కూడా వైసీపీకి అనుకూలంగా ఓట్లు నమోదు అయినట్టు కిందిస్థాయి కార్యకర్తలు అందించిన నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.నేతలందరూ సమన్వయంతో పనిచేయడం వల్లనే ఇది సాధ్యపడిందన్న అభిప్రాయం వైసీపీ అగ్రనేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది.ముఖ్యంగా విజయవాడ, విశాఖపట్నం వంటి అర్బన్ ప్రాంతాల్లో వైసీపీ అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోయిందనే విషయాన్ని వైసీపీ నిర్భయంగా ఒప్పేసుకుంటోంది.
ఎప్పుడూ టీడీపీకి అనుకూల పవనాలు వీచే ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ ప్రభావం ఈ సారి అంతంతమాత్రంగానే ఉండబోతున్నట్టు వైసీపీ అంచనా వేస్తోంది.ఉత్తరాంధ్ర లో మొత్తం 34 నియోజకవర్గాలు ఉండగా దానిలో ఈసారి 25 స్థానాలను ఖచ్చితంగా కైవసం చేసుకుంటామని వైసీపీ నాయకులూ ధీమాగా చెబుతున్న మాట.గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో కేవలం ఎనిమిది స్థానాలకే వైసీపీ తమ ఖాతాలో వేసుకుంది.కానీ ఇప్పుడు పరిస్థితులు మారడానికి కారణం ప్రధానంగా జగన్ పాదయాత్ర, నవరత్నాలు, బాక్సైట్ గనుల తవ్వకం రద్దు వంటి హామీలు బాగా పనిచేశాయని కిందిస్థాయి నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది.
అలాగే గత ఎన్నికల్లో జీరోకే పరిమితమైన పశ్చిమ గోదావరి జిల్లాలో 15 స్థానాల్లో తొమ్మిది స్థానాల వరకు సాధిస్తామనే ఆలోచనలో వైసీపీ ఉంది.అలాగే తూర్పు గోదావరిలో 19 స్థానాల్లో 13 స్థానాలు తమవే అన్న ధీమాలో వైసీపీ ఉంది.
ఇక రాయలసీమలో ఫ్యాన్ గాలికి అడ్డే లేదు అన్నట్టుగా వైసీపీ నాయకుల్లో అంచానాలు ఏర్పడ్డాయి.