ఏపీ అధికార పార్టీ వైసీపీ, జనసేన పార్టీ నాయకుల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో ఏపీ పొలిటికల్ వాతావరణం వేడెక్కుతోంది.సినిమా టికెట్లను ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం అమ్మాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకోవడంతో మొదలైన వివాదం వైసీపీ మంత్రులు వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్లుగా నేటికీ కొనసాగుతూనే ఉంది.
అయితే గతంలో ఎప్పుడూ లేనివిధంగా జనసేన ను వైసిపి టార్గెట్ చేసుకోవడం వ్యూహాత్మకంగానే కనిపిస్తోంది.తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకు జనసేన ను ట్రాప్ చేసినట్లుగా కనిపిస్తోంది.ప్రస్తుతం ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా టిడిపి ఉంది.2024 ఎన్నికల టార్గెట్ గా టిడిపి వ్యూహాత్మకంగా బలం పెంచుకుంటూ వస్తోంది.దీంతో జనసేన ను హైలెట్ చేసి టిడిపిని రాజకీయంగా దెబ్బతీసేందుకు వైసిపి అదేపనిగా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తూ పవన్ పై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నట్టుగా కనిపిస్తోంది.
ఏదో రకంగా టీడీపీని సైడ్ చేసి బిజెపి జనసేన వంటి పార్టీలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి, ఆ పార్టీల విమర్శలకు గట్టిగా స్పందించాలని, తద్వారా ఈ రెండు పార్టీలు హైలైట్ అవుతాయి అని, అప్పుడు టిడిపి వెనకబడుతుందని, ఎన్నికల సమయంలో ఈ రెండు పార్టీలకు పెద్దగా బలం, బలగం ఉండవు కాబట్టి, ఎన్నికల సమయంలో సునాయాసంగా గెలవ వచ్చు అనే వ్యూహం తో వైసిపి ఈ కవ్వింపు చర్యలకు దిగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో అనుమానాలు మొదలయ్యాయి.
వైసీపీ మంత్రుల విమర్శలకు స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందిస్తూ విమర్శలు చేస్తున్నారు.సోషల్ మీడియా ద్వారా వైసీపీ మంత్రులు, పవన్ ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.ఈ వ్యవహారంలో టిడిపి పూర్తిగా సైలెంట్ అయిపోయింది.ఇక ఆ పార్టీకి ఎక్కడా అవకాశం లేకుండా చేయాలి అనే ఉద్దేశం లోనే జనసేనానిని రెచ్చగొడుతున్నట్టుగా కనిపిస్తున్నారు.