తెలంగాణలో జరుగుతోన్న గ్రేటర్ ఎన్నికల సమరం మామూలుగా లేదు.ఇప్పటికే అధికార టీఆర్ఎస్తో పాటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలో దూసుకుపోతున్నాయి.
ఇక తెలుగుదేశం కూడా తమకు పట్టున్న ప్రాంతాల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది.ఇదిలా ఉంటే వైసీపీ, కమ్యూనిస్టు పార్టీలు గ్రేటర్లో పోటీ చేస్తాయా ? లేదా ? అన్న సందేహాలు నిన్న మొన్నటి వరకు ఉన్నాయి.అయితే ఎట్టకేలకు గ్రేటర్లో పోటీపై ఈ రెండు పార్టీల నుంచి క్లారిటీ వచ్చింది.
ఉభయ కమ్యూనిస్టు పార్టీలు గ్రేటర్లో పోటీపై ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాయి. సీపీఐ సీపీఎం లు 15 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేశాయి.సీపీఐ తరపున 8 మంది సీపీఎం తరపున ఏడుగురు అభ్యర్థులు ఉన్నారు.
గ్రేటర్లో మొత్తం 150 డివిజన్లు ఉంటే ఇప్పటి వరకు ఈ రెండు పార్టీలు కలిసి కేవలం 26 డివిన్లకు మాత్రమే అభ్యర్థులను ప్రకటిచాయి.బషీర్బాగ్ కాల్పుల తర్వాత గ్రేటర్లో కమ్యూనిస్టులు చాలా డివిజన్లలో తిరుగులేని బలమైన కేడర్ కలిగి ఉండేవారు.
అలాంటి కమ్యూనిస్టుల స్థాయి ఇప్పుడు ఓ పాతిక డివిజన్లకు కూడా అభ్యర్థులను పెట్టలేని స్థాయికి పడిపోయింది.
చేతులు ఎత్తేసిన వైసీపీ…
ఇక గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదని ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.
అయితే తెలంగాణలో వైసీపీని బలోపేతం చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని ఆయన చెప్పడం గమనార్హం.తెలంగాణలో గత కొంత కాలంగా జరుగుతోన్న ఎన్నికల్లో వైసీపీ పోటీ చేయడం లేదు.
అసెంబ్లీ ఎన్నికల సమయం నుంచి టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తూ వస్తోంది.ఆ తర్వాత జగన్కు, కేసీఆర్కు మధ్య కాస్త గ్యాప్ వచ్చినట్టు కనపడినా ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల్లో వైసీపీ ఎందుకు పోటీ చేయడం లేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
వైసీపీ పరోక్షంగా టీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తుండడమే ఇందుక కారణం అంటున్నారు.వైసీపీని అభిమానించే రెడ్డి సామాజిక వర్గానికే టీఆర్ఎస్ ఎక్కడ కార్పొరేటర్ సీట్లు ఇచ్చింది.
ఈ క్రమంలోనే వైసీపీ అభిమానులు పార్టీతో సంబంధం లేకుండా తమ రెడ్డి వర్గం వాళ్లను కార్పొరేటర్లుగా గెలిపించుకునేలా తెరవెనక ఒప్పందాలు కుదిరినట్టు భోగట్టా.!
.