రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం.నాకు తిరుగులేదు అని అనుకున్న నాయకులు సైతం టైం కలిసిరాక కుదేలైన పరిస్థితులు కోకొల్లలు.
ఇప్పుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు టీడీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే, దెందులూరు నుంచి గత ఎన్నికల్లో విజయం సాధించిన చింతమనేని ప్రభాకర్.వాస్తవానికి ఇక్కడ నుంచి రెండుసార్లు గెలిచిన ఆయన ఎన్ని చిందులు తొక్కినా ఇప్పటి వరకు బలమైన ప్రత్యర్థి లేకపోవడంతో బండి బాగానే నడిచింది.
అయితే, రోజులన్నీ ఒకేలా ఉండవు కదా.ఇప్పుడు చింతమనేని పరిస్థితి కూడా ఇలానే తల్లకిందలు అయ్యే పరిస్థితి వచ్చింది.
గత ఎన్నికల్లో ఉన్న పరిస్థితి వచ్చే ఎన్నికల్లో ఉండే పరిస్థితి కనిపించడం లేదు.ఒకపక్క ఆయనపై వ్యతిరేకత రాజ్యమేలుతుండగా.
ఆయనపై జిల్లా కోర్టు ఇచ్చిన తీర్పు కూడా వెంటాడుతోంది.
పదేళ్ల పాటు ఆయన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడంతో వచ్చే సహజ వ్యతిరేకత కొంత అయితే అధికారుల్లోనూ, ఆయన సొంత సామాజికవర్గంలోనూ, కొన్ని బీసీ కులాల్లోనూ ఆయనపై ఉన్న వ్యతిరేకత కూడా ఆయనకు మైనస్గా మారింది.ఈ నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్కు ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో గెలుస్తానా? లేదా? అనే డౌట్ వెంటాడుతోంది.దీంతో ఆయన ఏం చేయాలో కూడా అర్ధం కాక తలపట్టుకుంటున్నారు.
ఇక, ఇదే సయమంలో చింతమనేనిపై బండ పడేసేందుకు వైసీపీ కీలక అభ్యర్థిని రంగంలోకి దింపాలని ప్లాన్ చేసింది.
గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వైసీపీ తరఫున కారుమూరి వెంకట నాగేశ్వరరావు రంగంలోకి దిగారు.
ఆయన నాన్లోకల్ కావడంతో చింతమనేని ధాటికి ఆయన చేతులు ఎత్తేశారు.ఈ క్రమంలోనే దాదాపు 17 వేల ఓట్ల తేడాతో చింతమనేని విజయం సాధించారు.
అయితే, ఇప్పుడు వైసీపీ ఆనుపానులు గుర్తించి ఖచ్చితంగా చింతమేననికి దెబ్బేసే నాయకుడిని రంగంలోకి దింపేందుకు పావులు కదుపుతోంది.రాజకీయం గానే కాకుండా ఆర్థికంగా కూడా చింతమనేని ఎదిరించే నేతను రంగంలోకి దింపింది.
జగన్ దెందులూరు నియోజకవర్గం మీద స్పెషల్ కాన్సంట్రేషన్ చేశాడు.
గతంలో ఒకసారి చింతమనేనిపై పోటీ చేసిన కొఠారు రామచంద్రరావు ఫ్యామిలీ నుంచి ఆయన వారసుడు కొఠారు అబ్యయ్య చౌదరిని రంగంలోకి దింపింది వైసీపీ.
విదేశాల్లో ఉన్నత ఉద్యోగం చేస్తున్న అబ్బయ్య చౌదరిని కొన్నాళ్ల కిందట ఉద్యోగం మాన్పించి మరీ రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు.ఈ క్రమంలో నియోజకవర్గానికి చేరుకున్న అబ్బయ్య చౌదరి.
ప్రజలకు చేరువ అవుతున్నారు.ముఖ్యంగా యువత ఆయనకు బాగా దగ్గర అవుతున్నారు.
నియోజకవర్గంలో జరిగే వివిధ పంక్షన్లకు సైతం హాజరవుతూ ఉన్నత విద్యావంతుడు అయినా ఓ సామాన్యుడిలా ప్రజలకు దగ్గర అవుతున్నారు.
ఒంట్లో నరనరానా పచ్చ రక్తం నింపుకుని పదేళ్ల పాటు చింతమనేని వెంటే ఉన్న కొంతమంది యువ నేతలు చింతమనేని వ్యక్తిత్వంతో విబేధించి ఇప్పుడు అబ్బయ్య చౌదరి వైపు వెళ్లిపోతున్నారు.
దీంతో నిన్నటి వరకు ఆకాశంలో ఉండే చింతమనేని ఇప్పుడు తన సహజ సిద్ధ వ్యక్తిత్వానికి భిన్నంగా అడుగులు వేస్తున్నారు.ఈ క్రమంలోనే తన భార్య రాధారాణిని కూడా రంగంలోకి దింపారు.
తనపై ఉన్న కేసుల నేపథ్యంలో తనకు టికెట్ వచ్చే పరిస్థితి లేకపోతే.తన భార్యను రంగంలోకి దింపాలని ఆయన డిసైడ్ అయ్యారు.
ఇప్పుడు నియోజకవర్గంలో జరిగే ప్రతి ఫంక్షన్కు అబ్బయ్య చౌదరి తిరుగుతుంటే అటు చింతమనేనితో పాటు ఆయన భార్య రాధారాణి కూడా కవర్ చేసేస్తున్నారు.చింతమనేనికి పని ఉంటే ప్రతి ఫంక్షన్కు భార్య రాధారాణి అయినా అటెండ్ అవుతున్నారు.
విచిత్రం ఏంటంటే జగన్ దెందులూరు నియోజకవర్గ ప్రజాసంకల్ప యాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.అటు జగన్, వైసీపీ వీరాభిమానులతో పాటు ఇటు అబ్బయ్య చౌదరి ఫాలోవర్స్ కూడా ఈ యాత్రకు భారీగా తరలి వచ్చారు.
తన నియోజకవర్గంలో జగన్ యాత్రకు జనాలు ఎక్కువ వస్తే సహజంగానే చింతమనేనికి కాస్త టెన్షన్ ఉంటుంది.
ఓ వైపు జగన్ యాత్ర జరుగుతుంటే చింతమనేని ఆ యాత్ర మధ్యలోకి వెళ్లి పరిశీలించడం విశేషం.
చింతమనేని కాకతాళీయంగా అయితే అక్కడకు వెళ్లలేదని తెలుస్తోంది.ఈ నేపథ్యంలో ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడెక్కాయి.
ఒక్కమాటలో చెప్పాలంటే.వైసీపీ అభ్యర్థి అబ్బయ్య చౌదరి ఏ కార్యక్రమంలో పాల్గొంటే ఆ కార్యక్రమానికి చింతమనేని రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు.
మొత్తంగా ఈ పరిస్థితిని గమనిస్తున్నవారు.వచ్చే ఎన్నికల్లో చింతమనేనికి గెలుపుపై ఓవర్ కాన్ఫిడెన్స్ కాస్త దిగిందనే అంటున్నారు.