ఏపీలో గత రెండు మూడు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.టిడిపి, వైసిపి ల మధ్య మాటలు యుద్ధం తీవ్రతరం అయ్యింది.
జగన్ ను ఉద్దేశించి టిడిపి అధికార ప్రతినిధి పట్టాభి విమర్శలు చేసిన నేపథ్యంలో, వైసీపీ కార్యకర్తలు టిడిపి ప్రధాన కార్యాలయంపై దాడికి దిగడం, ఆ తరువాత ఆ వ్యవహారం లో పట్టాభిని పోలీసులు అరెస్టు చేయడం, టిడిపి అధినేత చంద్రబాబు 36 గంటల పాటు నిరసన దీక్షకు దిగడం, దీనికి పోటీగా వైసిపి ప్రజాగ్రహ దీక్షకు దిగడం, ఇలా ఎన్నో పరిణామాలు చోటుచేసుకున్నాయి.ఈ వ్యవహారం పై టిడిపి అధినేత చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేశారు.
అలాగే శనివారం ఢిల్లీకి వెళ్లి కొంత మంది కేంద్ర పెద్దలకు ఏపి వ్యవహారం పై ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉండగా, వైసిపి సైతం ఈ వ్యవహారంలో టిడిపిని ఇరుకున పెట్టేందుకు ఢిల్లీకి వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంది.
అవసరమైతే కేంద్ర పెద్దలను కలవడం తో పాటు, తెలుగుదేశం పార్టీ పై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయానికి వచ్చారట.
తెలుగుదేశం పార్టీ గుర్తింపును రద్దు చేయమని కోరాలని వైసీపీ నేతలు లేఖను అందించబోతున్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలుస్తోంది.ఈ లేఖ ద్వారా కీలకమైన పరిణామాలు ఏపీలో లేవనెత్తేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది.
రాజకీయ పార్టీల నేతలు బూతులు మాట్లాడుతున్న అంశాన్ని దృష్టికి తీసుకువెళ్ళబోతున్నారు.పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం ఎన్నికల సమయంలో మాత్రమే నేతలు వాడే భాష పై ఎన్నికల సంఘం చర్యలు తీసుకునేందుకు వీలు ఉంటుంది.
ఆ తరువాత నేతలు ఎటువంటి వ్యాఖ్యలు చేసినా, దానిని నియంత్రించే అవకాశం ఈసీకి పెద్దగా లేకపోవడంతో, దీనిపైన వైసిపి ఎన్నికల సంఘం తో చర్చించబోతోందట.ఎన్నికల సమయంలోనే కాకుండా, ఆ తర్వాత కూడా నాయకుల భాషను కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని వైసిపి కోరే అవకాశం ఉన్నట్లు సమాచారం.అంతేకాదు వైసీపీ అధినేత ఏపీ సీఎం జగన్ ను ఉద్దేశించి టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ తదితర సాక్ష్యాలను ఎన్నికల సంఘానికి సమర్పించి, టిడిపి పై కఠిన చర్యలు తీసుకునేలా వైసీపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.