సహజంగా ఏ పార్టీలో అయినా నాయకుల మధ్య ఆధిపత్య పోరు సర్వ సాధారణం.ఎవరికి వారు తాము గొప్ప అంటే తాము గొప్ప అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు.
ఇక ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో మరొకరు వేలు పెట్టి వ్యవహారాలు చేసేందుకు అస్సలు ఒప్పుకోరు.అది మంత్రులైనా, ఎంపీలు అయినా, మరెవరైనా ఇదే పరిస్థితి.
మొత్తం తమ నియోజకవర్గానికి తామే సుప్రీం అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటారు.ఇక పార్టీలు, ప్రభుత్వాలు కూడా ఒక ఎమ్మెల్యే నియోజకవర్గంలో మరొకరు కలుగజేసుకునేందుకు కుదరదని, ఏదైనా ఉంటే వారి అనుమతి తీసుకుని వ్యవహారాలు చక్కబెట్టాలని సూచిస్తూ ఉంటాయి.
ఇది ఇలా ఉంటే ఏపీ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ లో ఇప్పుడు ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యేలు అన్నట్టుగా వార్ ముదిరిపోతూ వస్తోంది.
ఏదో ఒకటీ రెండు నియోజకవర్గాల్లో అయితే ఫర్వాలేదు కానీ, దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో ఎక్కడికక్కడ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆధిపత్య పోరుతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకుంటూ, అధిష్టానానికి కొత్త తలనొప్పులు తీసుకువస్తున్నారు.
ముఖ్యంగా ఎమ్మెల్యేలు చాలామంది తమ నియోజకవర్గాల్లో ఎంపీ ల పెత్తనం లేకుండా చూసుకుంటున్నారు.ఏదైనా ప్రభుత్వానికి సంబంధించిన ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో మరీ ముఖ్యం అనుకుంటే తప్ప, మిగతా వ్యవహారాల్లో ఎంపీల జోక్యం లేకుండా చూసుకుంటున్నారు.
దీంతో ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య వివాదాలు చెలరేగుతూ రావడం అధికార పార్టీ వైసీపీలో నిత్యకృత్యంగా మారిపోయింది.
నియోజకవర్గంలో జరిగే కొన్ని ప్రభుత్వ పనులకు సంబంధించి ఎమ్మెల్యేల నుంచి తమకు కనీసం ఆహ్వానాలు అందడం లేదని, తమను పట్టించుకోనట్టు గానే ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారు అని, ఎంపీ గా ఉండి కనీసం తమ అనుచరులకు చిన్నా చితకా పనులు కూడా చేయించలేకపోతున్నామని, ఎంపీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంఫై కొంత కాలంగా వివాదం నడుస్తున్నా, జిల్లా ఇంచార్జి మంత్రుల ద్వారా అధిష్టానం కూడా ఆరాధిస్తూ ఎప్పటికప్పుడు ఆ వ్యవహారాలను చక్కబెడుతూ వస్తోంది.అయినా పరిస్థితిలో మార్పు లేకపోవడం, వంటి కారణాలతో ప్రజల్లోనూ, ఎంపీ, ఎమ్మెల్యేల వివాదాలపై చర్చలు నడుస్తున్నాయి.
ఈ వ్యహారాలపై కొంతకాలంగా ఆగ్రహంగా ఉన్న వైసీపీ ఎంపీలు ఈ విషయంఫై జగన్ వద్ద పంచాయతీ పెట్టాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది.