ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అంటూ తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది.జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేయడంతో పాటు పరిపాలనా రాజధానిగా విశాఖను ఎంపిక చేయడం, దానికి సంబంధించిన కార్యాచరణ మొత్తం పూర్తి చేసే క్రమంలో ముందుకు వెళ్తుండడం వంటి పరిణామాలు జరుగుతున్నా, మరోవైపు కరోనా వైరస్ ప్రభావం ఉన్నా, చంద్రబాబు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ, అమరావతి వ్యవహారాన్ని వదిలిపెట్టేలా కనిపించడం లేదు.
ప్రస్తుతం కరోనా ప్రభావంతో చంద్రబాబు వయసు రీత్యానూ బయటకు వచ్చే పరిస్థితి లేకపోయినా, జూమ్ యాప్ ద్వారా అమరావతి వ్యవహారంపై పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నారు. అసలు ఇప్పుడు అమరావతి వ్యవహారంలో తెలుగుదేశం పార్టీ అలుపెరగకుండా పోరాటం చేస్తోంది.
ఇదే సమయంలో ఆ పార్టీపై ఎన్నో ప్రశ్నలు వర్షం అధికార పార్టీ కురిపిస్తోంది.ఈ విషయంలో చంద్రబాబు కానీ, ఆ పార్టీ నాయకులు గానీ సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉండిపోతున్నారు.
అమరావతి రాజధానిగా గత టీడీపీ ప్రభుత్వం ప్రకటించక ముందే, టిడిపికి చెందిన నాయకులంతా బినామీ పేర్లతో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, వాటి విలువ పెంచేందుకే అమరావతి ని రాజధాని గా ప్రకటించి భారీగా లబ్ధి పొందాలని చూసారని టీడీపీపై వైసీపీ విమర్శలు చేస్తున్నా, ఇప్పటి వరకు సరైన సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో టిడిపి ఉంది.
అలాగే ఐదేళ్ల తెలుగుదేశం ప్రభుత్వం అమరావతి లో తాత్కాలిక భవన నిర్మాణాలు తప్ప, శాశ్వతంగా రాజధానిని ఏర్పాటు చేయలేకపోవడం వంటివి ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తోంది అంటూ వైసీపీ ఇప్పుడు ఆరోపణలు చేస్తోంది.అసలు అమరావతి లో రాజధాని ఏర్పాటు చేసి ఏపీకి సుమారు మూడు లక్షల కోట్ల ఆదాయం తీసుకువచ్చే ప్రయత్నం చేశామని, టిడిపి ఇప్పుడు చెబుతోంది.అయితే అంత ఆదాయం వచ్చే అవకాశం ఉంటే, అమరావతి లో యుద్ధ ప్రాతిపదికన ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారని వైసిపి ప్రశ్నిస్తున్నా, సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో టిడిపి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉండిపోతున్నారు.
అసలు అమరావతి పేరుతో టీడీపీ నాయకులు భారీగా లబ్ధి పొందే ప్రయత్నం చేశారని, రియల్ ఎస్టేట్ ను ప్రోత్సహించేందుకు ఇక్కడ రాజధాని ప్రకటించారని, ఒక సామాజిక వర్గానికి మేలు చేసేందుకు ప్రయత్నించారని వైసిపి ఆరోపిస్తున్న, స్పష్టంగా, సూటిగా సమాధానం తెలుగుదేశం పార్టీ చెప్పలేకపోతోంది.ప్రస్తుతం హైదరాబాద్ లోనే చంద్రబాబు ఉంటూ, జూమ్ యాప్ ద్వారా, అమరావతి ఉద్యమం ను హీటెక్కించే పనిలో ఉన్నా, అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు.
కనీసం పార్టీ శ్రేణులు కూడా దీనిపై పోరాటం చేసేందుకు ముందుకు రాకపోవడం వంటివి చూస్తుంటే, అమరావతి వ్యవహారం ఇక అటకెక్కినట్లుగా కనిపిస్తోంది.