కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు తో తెలంగాణలో రాజకీయ సునామి సృష్టించాలని చూస్తున్న వైఎస్ షర్మిల మరో రెండు నెలల్లో పార్టీ పేరును ప్రకటించేందుకు ఆమె ఇప్పటి నుంచే అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు.పార్టీ పేరు ప్రకటించక ముందే, తమ పార్టీకి జనాదరణ ఉండేలా చూసుకుంటున్నారు.
అప్పటి వరకు షర్మిల అనే బ్రాండ్ బలోపేతం చేయాలని ప్లాన్ చేస్తున్నారు.ప్రస్తుతం నిరుద్యోగుల సమస్యలను ఎత్తిచూపుతూ, వారికి న్యాయం చేయాలని కోరుతూ దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతూ, హడావుడి చేస్తున్నారు.ఇప్పటికే సన్నిహితులు, స్నేహితులు , శ్రేయోభిలాషులు అందరితోనూ ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించారు.
నేరుగా కలవ లేని వారికి ఫోన్ చేసి షర్మిల ఆహ్వానాలు పంపుతున్నారు.తాము పార్టీ పేరును ప్రకటించడం తరువాయి పెద్ద ఎత్తున ఇతర పార్టీ లలోని నాయకులతో పాటు, మహిళలు, యువత, వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున చేరుతారని ఆమె ఆశలు పెట్టుకున్నారు.
అంతే కాదు వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఆయన అనుచరులుగా ముద్ర పడిన వారంతా తన వెంట నడుస్తానని, తెలంగాణలో బలమైన శక్తిగా ఎదగాలని షర్మిల చూస్తుండగా, వైయస్సార్ అభిమానులు సన్నిహితుల నుంచి పెద్దగా రియాక్షన్ ఐతే కనిపించడం లేదట.ముఖ్యంగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులుగా ముద్ర వేయించుకున్న కొండా సురేఖ దంపతులు ఇప్పుడు మొహం చాటేయడం చర్చనీయాంశం అవుతోంది.ఇప్పటికే వారిని పార్టీలోకి రావాలంటూ వైయస్ షర్మిల ఆహ్వానించారు. అయినా వారు షర్మిల ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని , ప్రస్తుత పరిస్థితుల్లో మీ పార్టీ లోకి రాలేమని వర్తమానం పంపినట్లు తెలుస్తోంది.
వీరే కాదు, మరెంతో మంది వైఎస్సార్ అభిమానులు ఇదే విధమైన సమాధానం చెబుతుండడం షర్మిల జీర్ణించుకోలేక పోతున్నారట.
ఎందుకంటే బలమైన నాయకులను పార్టీలో చేర్చుకోవడం ద్వారా నే, ఇంకా బలంగా ఉన్న టిఆర్ఎస్ , బిజెపి వంటి పార్టీలను ఢీకొట్టడం సాధ్యమవుతుందని, అప్పుడే తెలంగాణ సీఎం అవ్వాలనే కోరిక తీరుతుందని షర్మిల ఆశలు పెట్టుకోగా, ఆమె నమ్ముకున్న వారు ఇప్పుడు హ్యాండ్ ఇవ్వడం కాస్త ఇబ్బందికరంగా మారినట్లు గా కనిపిస్తోంది.