ఏపీ, తెలంగాణ సీఎంలు కేసీఆర్ , జగన్ మధ్య ఉన్న అనుబంధం ఎటువంటిదో అందరికీ తెలుసు.జగన్ కోసం కేసీఆర్, కేసీఆర్కోసం జగన్ అన్నట్లుగా అన్ని విషయాలలోనూ ఒకరికొకరు సహకరించుకుంటూ వస్తున్నారు.
రాజకీయంగా ఉన్న ఇబ్బందులను ఒకరికొకరు సామరస్యంగా పరిష్కరించుకుందాం అనే భావం తో ఉంటూ వస్తున్నారు.అయితే తెలంగాణలో వైయస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు చేస్తుండటం, టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తుండడంతో, జగన్ కేసీఆర్ మధ్య దూరం పెరిగింది అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
కానీ కొత్త పార్టీని కేసీఆర్ షర్మిల తో ఏర్పాటు చేయిస్తున్నారని, తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు అవకాశం లేకుండా చేసేందుకు షర్మిలను జగన్ సహకారంతో కేసీఆర్ రంగంలోకి దింపారు అనే వార్తలు ఎన్నో వచ్చాయి.
ఇప్పుడు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి.
ఇక్కడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మృతితో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య హోరాహోరీగా పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ఉద్దండుడు , సీనియర్ నాయకుడు జానారెడ్డి పోటీకి దిగుతున్నారు.దీంతో టీఆర్ఎస్ కాస్త కంగారు పడుతోంది.
అయితే అనూహ్యంగా ఇక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోటీ చేసేందుకు సిద్ధం కావడంతో అందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.తెలంగాణలో చాలా కాలం నుంచి పోటీకి దూరంగా ఉంటూ వస్తున్న వైసీపీ ఇప్పుడు అనూహ్యంగా నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో పోటీకి దిగుతుండడంతో అందరిలోనూ అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.
కేసిఆర్ సూచన మేరకే నాగార్జునసాగర్ బరిలో వైసీపీ అభ్యర్థి పోటీకి దిగుతున్నారని, రెడ్డి సామాజిక వర్గం ఓట్లను చీల్చి టిఆర్ఎస్ కు మేలు కలిగే విధంగా చేసేందుకు వ్యూహాత్మకంగా ఇక్కడ వైసిపి అభ్యర్థిని పోటీకి పెడుతున్నారనే గుసగుసలు మొదలయ్యాయి.
ఇప్పటికీ ఇక్కడ 13 నామినేషన్లు దాఖలయ్యాయి.ఇవే కాకుండా 400 మంది అమరవీరుల కుటుంబాలకు చెందిన వారు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోటీకి దిగుతున్నట్లు ప్రకటించడంతో ఆందోళన ఉన్న ఆ పార్టీ అధినేత కేసీఆర్ జగన్ సహకారంతో తెలంగాణలో వైసీపీ అభ్యర్థిని పోటీకి పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది.అయితే వైసీపీ అభ్యర్థి ఇక్కడ నుంచి పోటీ చేయడం టిఆర్ఎస్ కు మేలు చేస్తుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.