ఏపీ రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత జగన్ ముందుకు వెనక్కి వెళ్లలేకపోతున్నాడు.అసలు రాజధాని నిర్మాణం పై జగన్ ఏ క్లారిటీ కి వచ్చాడు అనే విషయంలో గందరగోళం అన్నివర్గాల్లో నెలకొంది.
దీని చుట్టూ అనేక రాజకీయాలు ఉండడంతో జగన్ స్పష్టమైన వైకిరిని అవలంభించలేకపోతున్నాడు.అమరావతి అనేది రాజకీయ అంశంగా మారడమే కాకుండా సామాజికీయంగా, ఆర్ధికంగా అనేక అంశాలు దీని చుట్టూ ముడిపడి ఉండడంతో ఈ రకమైన ఉత్కంఠ నెలకొంది.
రాజధాని ప్రజల కోసం తప్ప ప్రభుత్వం మారగానే అన్ని విషయాలను పక్కన పెట్టెయ్యడం సరైన నిర్ణయం కాదు అనే అభిప్రాయం ఇప్పుడు చాలామందిలో వ్యక్తం అవుతోంది.ఇక, సామాన్యుల పరిస్థితి అభిప్రాయం కూడా ఇదే అన్నట్టుగా అక్కడి పరిస్థితులు నెలకొన్నాయి.
రాజధాని విషయంలో ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా దానిని రాజకీయం చేస్తున్నారనే విమర్శలు అధికార పక్షం నుంచి వినిపిస్తున్నాయి.కానీ దీనిని ఆ కోణంలోనే చూడకుండా అక్కడి పరిస్థితులను, రాజధాని నిర్మాణం చేపట్టడం వల్ల వచ్చే ఫలితాలు, చేదు అనుభవాలను అన్నిటిని ఒక్కసారి విశ్లేషించుకుని ఈ విషయంలో ఏదో ఒక క్లారిటీ కి రాకపోతే వైసీపీ ప్రభుత్వంపై నిందలు వేసేవారి సంఖ్య పెరగడం మాత్రం ఖాయం.
రాజధాని నిర్మాణానికి నిధులు లేవని, రాజధాని నిర్మాణం ఆపడం ముమ్మాటికి పొరపాటే అని కొంతమంది పార్టీ నాయకులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.అయితే రాజధాని నిర్మాణానికి ఆర్థిక సాయం అందించడానికి ముందుకొచ్చిన ప్రపంచ బ్యాంక్, ఏషియన్ డెవల్పమెంట్ బ్యాంక్ వంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వ వైకిరి ఏమిటో తెలియక వెనక్కు వెళ్లిపోయాయి.
దీనికి గతంలో వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా అనుసరించిన విధానాలు కూడా ఒక కారణంగా కనిపిస్తున్నాయి.గతంలో చంద్రబాబు ప్రభుత్వంపై మాటల దాడి చేసిన వైసీపీ నాయకులు రాజధాని విషయంలోనూ ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేసిన సంగతి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.ఈ సంగతి కాస్త పక్కన పెడితే అభివృద్ధి ప్రక్షాళన చేస్తానంటూ జగన్ ప్రకటించడంతో హైకోర్టు, రెండో రాజధాని విషయంలో వివాదం తెరమీదికి వస్తోంది.తమ ప్రాంతంలో ఈ రెండింటిలో ఒకటి ఏర్పాటు చేయాలంటూ సీమ ప్రాంతంలో ఉద్యమాలు మొదలుపెట్టడంతో రాజధాని వ్యవహారం గందరగోళం లో పడిపోతోంది.
జగన్ మాత్రం ఎంత రచ్చ జరిగినా ఈ విషయంలో తన వైకిరి ఏంటో ఇప్పటికీ స్పష్టం చేయకుండా నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నాడు.