ఎవరూ ఊహించని విధంగా తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు దిశగా వైఎస్ షర్మిల అడుగులు వేస్తూ, ప్రధాన రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు.ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ, ప్రధాన పార్టీలకు ఆందోళన పెంచుతున్నారు.
షర్మిల రాజకీయంగా తీసుకుంటున్న నిర్ణయాలు, ఆమె శరవేగంగా తెలంగాణలో బలపడేందుకు వ్యవహరిస్తున్న తీరు అన్ని తెలంగాణ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.ఇప్పటికే టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత పెరుగుతోందనే సంకేతాలు వస్తుండడం, తెలంగాణలో కాంగ్రెస్ బలహీనపడడం, బిజెపి జాతీయ స్థాయిలో ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవడం , ఇవన్నీ తమకు కలిసి వస్తాయని షర్మిల భావిస్తున్నారు.
అందుకే పార్టీ పెట్టేందుకు ఇదే సరైన సమయంగా ఆమె ఎంచుకున్నారు.దీనిలో భాగంగా రేపు ఖమ్మం లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా చూసుకుంటున్నారు.అలాగే తెలంగాణలో ఉన్న వైసిపి నాయకులకు, వైసీపీ అభిమానులకు, కాంగ్రెస్ , బీజేపీ లో ఉంటూ రాజకీయ ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూస్తున్న అసంతృప్త నేతలను ఆమె చేర్చుకుని తెలంగాణలో బలపడాలి అని చూస్తున్నారు.
అలాగే నియోజకవర్గస్థాయి నాయకులకు స్వయంగా షర్మిల ఫోన్ లు చేస్తూ, పార్టీలోకి రావాలంటూ ఆహ్వానిస్తున్నారట.
ఈ సందర్భంగా తాను పార్టీ పెట్టడానికి గల కారణాలు, రాబోయే రోజుల్లో పార్టీని ఏ విధంగా అధికారంలోకి తీసుకురాబోతున్నాము అనే విషయాలపైన సదరు నాయకులతో చర్చిస్తూ, వారి భవిష్యత్ కు ఎటువంటి డోఖా లేకుండా చూసుకునే బాధ్యత తనదే అన్నట్లుగా ఆమె మాట్లాడుతూ ఉండడంతో, తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నట్టు కనిపిస్తున్నాయి.ముఖ్యంగా షర్మిల ఫోన్ ద్వారా ఇతర పార్టీలలోని నాయకులను తాము ఏర్పాటు చేయబోయే పార్టీలోకి రావాలంటూ ఆహ్వనిస్తూ ఉండడం వర్కవుట్ అవుతున్నట్టుగానే కనిపిస్తోందట.