తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ వైఎస్ఆర్ టిపి ప్రభావం ఏమీ ఉండదు అనే అభిప్రాయానికి అందరూ వచ్చేశారు.పార్టీ ఆవిర్భావ సమయంలో కనిపించిన ఉత్సాహం, ఇప్పుడు కనిపించడం లేదు.
దీనికి తోడు పెద్ద ఎత్తున పార్టీలో చేరికలు ఉంటాయని అందరూ అభిప్రాయపడ్డారు.కానీ మొదట్లో చేరిన నేతలు బయటకు వచ్చేస్తూ ఉండటం, షర్మిల పార్టీ ప్రభావం ఏమీ ఉండదు అనే కారణంతో చాలామంది వైఎస్సార్ టిపి ని వీడి ఇతర పార్టీల్లో చేరిపోవడం వంటివి కాస్త ఆందోళన పెంచాయి.
ఆమె అనేక దీక్షలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ , టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ పెద్దఎత్తున విమర్శలు చేస్తున్నారు.ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేపడుతూ పార్టీ బలాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
తమ పార్టీ పరిస్థితిపై అందరిలోనూ ఆందోళన కనిపిస్తున్నా, షర్మిల మాత్రం ఈ విషయంలో చాలా ధీమాగానే ఉన్నారు. పార్టీ ఎప్పటికైనా పుంజుకుంటుందని , 2023 ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రభావం చూపిస్తుంది అనే నమ్మకంతో ఆమె ఉన్నారు.
అందుకే ఎప్పటి నుంచే పార్టీ నిర్మాణంపై సీరియస్ గానే ఆమె దృష్టి పెట్టారు.గ్రామస్థాయి నుంచి కమిటీలను నియమించి పార్టీని బలోపేతం చేయాలని ఆమె నిర్ణయించుకున్నారు.త్వరలోనే గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పెద్ద ఎత్తున పార్టీ పదవులను భర్తీ చేసే కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు.అలాగే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాలని, తెలంగాణలోని 119 నియోజకవర్గాలలోనూ అభ్యర్థులను బరిలోకి దింపాలనే ఆలోచనతో ఆమె ఉన్నారు.
అయితే ఇప్పటికిప్పుడు అభ్యర్థిని ప్రకటించడం కాకుండా, ఏడాది ముందుగానే 119 నియోజకవర్గాల అభ్యర్థుల ను ప్రకటించి ఇప్పటి నుంచే ఎన్నికలను ఎదుర్కొనేలా ఆమె ప్రణాళిక రచించారు.ఇక 20వ తేదీ నుంచి ఆమె తెలంగాణలో పాదయాత్రను చేపట్టబోతున్నారు.
చేవెళ్ల నుంచి ఈ యాత్రను ప్రారంభించి మళ్లీ చేవెళ్ల లోనే ముగించే విధంగా ఏర్పాట్లు చేసుకున్నారు.
ప్రజా ప్రస్థానం పేరుతో జరగబోతున్న ఈ యాత్ర వచ్చే ఏడాది అక్టోబర్ వరకు కొనసాగుతుంది.మొత్తం 90 నియోజకవర్గాలు ఈ యాత్ర కొనసాగేలా ఏర్పాట్లు చేశారు.ప్రతిరోజు 10 నుంచి 20 కిలోమీటర్ల వరకు యాత్ర కొనసాగించేలా ఏర్పాట్లు చేశారు.
దీని కోసం ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకున్నారు.పాదయాత్ర సమయంలోనే పార్టీలోకి వలసలు పెరిగే విధంగా ప్రోత్సహించేందుకు ఆమె వ్యూహం రచించారు.
గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పాదయాత్ర నిర్వహించిన అనుభవం షర్మిలకు ఉండడంతో, ఉత్సాహంగానే ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.ఇవే కాకుండా ఏడాది ముందుగానే అభ్యర్థులను ప్రకటించి సరికొత్త రాజకీయ ఎత్తుగడకు షర్మిల తెర తీసినట్లుగా కనిపిస్తున్నారు.
.