ఇటీవల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర చేస్తున్న సమయంలో ఆమెను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడం, ఆ తరువాత ఆమె ప్రగతి భవన్ ముట్టడించేందుకు ప్రయత్నించడం, పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం, అంతకుముందు ఆమె కాన్వాయ్ పై టీఆర్ఎస్ కు చెందిన వ్యక్తులు దాడులకు పాల్పడడం, ఆ పాదయాత్రను అడ్డుకోవడం తదితర వ్యవహారాలు చోటు చేసుకున్న తర్వాత షర్మిల ప్రస్తావన తెలంగాణ రాజకీయాల్లో హైలెట్ అయింది.ఇప్పటి వరకు బిజెపి , కాంగ్రెస్, టిఆర్ఎస్ ల మధ్య పోరు ఎక్కువగా కనిపించగా, ఇప్పుడు షర్మిల కూడా ప్రధాన ప్రత్యర్థుల జాబితాలో చేరిపోయారు.
ఈ మేరకు ఆమె ఆ స్థాయిలో గ్రాఫ్ పెంచుకున్నారు .
అయితే పార్టీలో పెద్దగా చేరికలు లేకపోయినా రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని , రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామనే నమ్మకంతో షర్మిల ఉన్నారు.అందుకే ఇప్పుడు వచ్చిన పొలిటికల్ మైలేజ్ ను ఏమాత్రం తగ్గకుండా చూసుకునే ప్రయత్నాల్లో ఆమె ఉన్నారు.దీనిలో భాగంగానే ఈనెల నాలుగో తేదీ నుంచి తాను తిరిగి పాదయాత్రను వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లింగగిరి గ్రామం నుంచి తిరిగి ప్రారంభిస్తున్నాను అని , ఈనెల 14 వరకు యాత్ర కొనసాగుతుందని ఆమె ప్రకటించారు.
ఈ మేరకు తన పాదయాత్రకు రక్షణ కల్పించాలని కోరేందుకు ఆమె నిన్ననే బిజెపి కార్యాలయానికి వెళ్లి డీజీపీ ని కలిసే ప్రయత్నం చేశారు.అయితే ఆయన అందుబాటులో లేకపోవడంతో అదనపు డీజీకి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా పాదయాత్ర కొనసాగించేందుకు హైకోర్టు ఇచ్చిన అనుమతి పత్రాన్ని ఆమె డిజికి అందించారు.ఈ సందర్భంగా షర్మిల మీడియా సమావేశాన్ని నిర్వహించి సంచలన రాజకీయ విమర్శలు చేశారు.‘ బిజెపికి నేను దత్త పుత్రికను అని టిఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.మరి కెసిఆర్ బిజెపికి పెళ్ళాం అని అనాలా నేను.
అసలు నేను నిలదీసినట్లుగా బిజెపిని ఎవరు నిలదీస్తున్నారు.నన్ను నల్లి మాదిరిగా నలిపేస్తామని టిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.
ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడుతారు… తాలిబన్లు.తాలిబాన్ల రాజ్యం తెలంగాణలో నడుస్తోందని, కెసిఆర్ ఈ తాలిబన్ల అధ్యక్షుడు అని , ఏమి చేసుకుంటారో చేసుకోండి.
వైయస్సార్ బిడ్డ దేనికి భయపడదు.ఈ బందిపోట్లను రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాల్సిన సమయం వచ్చిందంటూ షర్మిల విమర్శలు చేశారు.