కేసీఆర్ వదిలిన బాణమో, జగన్ వదిలిన బాణమో, లేక సొంతంగా తెలియక షర్మిల విషయంలో ఏపీ, తెలంగాణ జనాలంతా కన్ఫ్యుజ్ అవుతున్నారు.తెలంగాణలో చాలా ధైర్యం చేసి షర్మిల పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు.
పార్టీ ప్రకటన కంటే ముందుగానే ఆమె సన్నిహితులు, ఆత్మీయులతో సమావేశాలు నిర్వహిస్తూ, పార్టీ మేనిఫెస్టో ను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు.తెలంగాణలో అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాలు ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
అంతేకాదు తెలంగాణ అంతటా పాదయాత్ర నిర్వహించి పట్టు పెంచుకునేందుకు చూస్తున్నారు.అయితే తెలంగాణలో షర్మిల పార్టీకి ఆదరణ ఉంటుందా లేదా అనే సందేహం మొదట్లో అందరిలోనూ కలిగినా, ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఆదరణ ఉండడమే కాదు, అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అన్నంత స్థాయిలో ఆ పార్టీ రాజకీయ వ్యూహాలు ఉన్నాయి.
అసలు షర్మిలతో పార్టీ పెట్టించింది తెలంగాణ సీఎం కేసీఆర్ అనే మాటలు వినిపించినా, ఒకవేళ నిజమైన టిఆర్ఎస్ పార్టీ కంటే షర్మిల పార్టీకే ఎక్కువ ఛాన్స్ ఉంది అన్నట్లుగా వ్యవహారాలు కనిపిస్తున్నాయి.
దీనికి తగ్గట్టుగానే ఆమె పార్టీలో చేర్చుకునే వారంతా ప్రజాబలం ఉన్న వారు కావడం, పార్టీ పేరు ప్రకటించిన తరువాత టిఆర్ఎస్ , కాంగ్రెస్, బిజెపి అసమ్మతి నేతలు వచ్చేందుకు ఇప్పటికే ప్లాన్ చేసుకోవడం , తెలంగాణలో కాంగ్రెస్ గ్రాఫ్ మరింతగా తగ్గడం, బిజెపి కి కాస్త ఆదరణ ఉన్నట్లు కనిపించినా, పేరున్న నాయకులు పెద్దగా లేకపోవడం, మరో వైపు అధికార పార్టీ టిఆర్ఎస్ కు ప్రజా వ్యతిరేకత తీవ్రంగా పెరుగుతుండడం, రాబోయే ఎన్నికల నాటికి మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపించడంతో షర్మిల పార్టీ కి అధికారం దక్కి, ఆమె సీఎం అయినా ఆశ్చర్యం లేదు అన్నట్లుగా ఇప్పుడు తెలంగాణ రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయట.
ఏప్రిల్ 9వ తేదీన షర్మిల తన కొత్త పార్టీని ఖమ్మంలో ప్రకటించబోతున్నారు.అదే తేదీన భారీ బహిరంగ సభను నిర్వహించి తమ పార్టీ విధివిధానాలు బయటకి వెల్లడించబోతున్నారు.
అందుకే ఇప్పటి నుంచే అన్నీ ప్లాన్ చేసుకుంటున్నారు.గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ పదవులను భర్తీ చేసి , క్షేత్రస్థాయిలో బలం పెంచుకునేందుకు , వారికి పార్టీలో పెద్దపీట వేసేందుకు షర్మిల, ఆమె రాజకీయ వ్యూహకర్తలు ప్లాన్ చేసుకున్నారట.ఇప్పుడు ప్రధాన రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టించే విధంగా తన పార్టీని షర్మిల బలోపేతం చేస్తుండడంతో , ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ ఆందోళన, ఆసక్తితో షర్మిల పార్టీలో నెలకొంటున్న పరిణామాలను గమనిస్తున్నాయి.