తెలంగాణలో పార్టీ పెట్టబోతున్న షర్మిల పార్టీ పేరును ఇంకా ప్రకటించకుండానే ముందుకు వెళ్తున్న తీరు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.పార్టీ పేరు ప్రకటించకపోయినా, కమిటీలు, పర్యటనలు, సభలు, సమావేశాలు, విమర్శలు, ప్రతి విమర్శలు, ప్రజా సమస్యలపై అధికార పార్టీని ప్రశ్నిస్తూ ముందుకు వెళ్తున్న తీరుపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.
తన తండ్రి రాజశేఖర్ రెడ్డికి ఉన్న ఇమేజ్ సరిగ్గా వాడుకుంటూ, తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకు వస్తానని పదే పదే ప్రకటనలు చేస్తున్నారు.ఇక అత్యంత సన్నిహితులు, స్నేహితులతో సమావేశాలు నిర్వహిస్తూ, పార్టీ విధివిధానాలు ఎలా ఉండాలి, జనాల్లో కి ఎలా వెళ్లాలి అనే విషయంపైన షర్మిల చర్చిస్తున్నారు.
జిల్లాల వారీగా తమతో కలిసి నడిచే నాయకులు, మేధావులు, విద్యావేత్తలు అందరి అభిప్రాయాలను తీసుకుంటున్నారు.
పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే ఉద్దేశంతో అప్పుడే కీలకమైన వ్యక్తులకు పార్టీ పదవులను అప్పగిస్తున్నారు.
పార్టీ పేరు ప్రకటించకుండానే మండల స్థాయిలో బలమైన పునాదులు వేసుకోవాలని, మండలానికి ముగ్గురు సభ్యుల చొప్పున కమిటీలను నియమించాలని, వీటిని 16వ తేదీ లోపు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.షర్మిల ప్రధాన అనుచరుడు రామ్ రెడ్డి కి ఆ బాధ్యతలు అప్పగించారు.
ఈ కమిటీలలో ఎక్కువగా మొదటి నుంచి వైస్ తో సన్నిహితంగా ఉన్న వారికి, వైఎస్.రాజశేఖర్ రెడ్డి ని అభిమానించే వారికి, ఈ పదవుల్లో ప్రాధాన్యత ఇస్తున్నా, ఇక మిగతా పార్టీలలో ఉన్న కీలకమైన నాయకులకు, కాంగ్రెస్ లో కీలక నాయకులుగా గుర్తింపు పొందిన వారికి నేరుగా ఫోన్ చేసి మరి షర్మిల పార్టీ లోకి రావాలని, కీలకమైన పదవులు అప్పగించి తగిన ప్రాధాన్యం కల్పిస్తామని హామీలు ఇస్తున్నారు.
ఇక కీలకమైన నాయకులు అనుకున్న వారికి నేరుగా వైస్ షర్మిల, వైయస్ విజయలక్ష్మి లకు ఫోన్ చేస్తున్నారట.ఈనెల 9వ తేదీన పార్టీ పేరును ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఆ తేదీలోగా బలమైన పునాదులు వేసుకుని ప్రధాన పార్టీలకు ధీటుగా తన పార్టీని నిలబెట్టాలని షర్మిల చూస్తున్నారు.ఇక పార్టీ జెండాను ఆవిష్కరించేందుకు కసరత్తు చేస్తున్నారు.ముఖ్యంగా మూడు రంగులు వుండే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.వైసీపీ జెండా పోలిన విధంగా షర్మిల పార్టీ జెండా ఉండబోతోందట.