వైఎస్ షర్మిల రాజకీయ అడుగులు సర్వత్రా ఆసక్తిని కలిగిస్తున్నాయి.అసలు ఆమె ఏపీని వదిలిపెట్టి తెలంగాణ రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే పెద్ద సంచలనం.
పార్టీ పేరు ఇంకా ప్రకటించకపోయినా, ఆమె మాత్రం అన్ని రాజకీయ వ్యవహారాలను చాకచక్యంగా చక్కబెట్టుకుంటున్నారు.ఈనెల 9వ తేదీన ఆమె వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన వివిధ పార్టీల నాయకులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం, అందరి అభిప్రాయాలను తీసుకోవడం, వివిధ జిల్లాల్లో ఆమె పర్యటనకు ఏర్పాట్లు చేసుకోవడం ఇలా అన్ని వ్యవహారాలు ఉత్కంఠ కలిగిస్తూనే ఉన్నాయి.
నిన్ననే ఖమ్మం జిల్లాకు చెందిన నాయకులతో ఆమె హైదరాబాద్ లో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఏపీలో జగన్ కు అత్యంత సన్నిహితులైన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి షర్మిల తో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు.
ఆ సమావేశం తాలూకా వివరాలు ఏవీ బయటకు రానప్పటికీ , జగన్ రాయబారిగానే ఆమె షర్మిల తో భేటీ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ఈ సమావేశం ముగిసిన తరువాత షర్మిల హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లిపోయారు.
ఈ విషయాన్ని స్వయంగా వైయస్ షర్మిల అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ప్రకటించారు.మరో మూడు రోజుల పాటు షర్మిల బెంగళూరు లోనే మకాం వేయబోతున్నట్టు సమాచారం.
అయితే ఇంత అకస్మాత్తుగా షర్మిల బెంగళూరు ప్రయాణం పెట్టుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయట.

ప్రస్తుతం పార్టీ ఏర్పాటు పనుల్లో నిమగ్నమైన షర్మిలను కీలక నాయకులు చాలామంది వచ్చి కలుస్తున్నారు.అలాగే తెలంగాణ ఏపీ లోని వివిధ రాజకీయ పార్టీల నాయకులు షర్మిలతో భేటీ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.కానీ, షర్మిలతో భేటీ కావడం వల్ల రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం సదరు నాయకులకు ఉండడంతో, బెంగళూరు లోనే ఆమె ఈ సమావేశాలు నిర్వహించాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఇక మూడు రోజుల అనంతరం మళ్లీ తెలంగాణలో ఆమె అడుగు పెట్టి , వివిధ జిల్లాల్లో పర్యటించే ఏర్పాట్లను చేసుకోబోతున్నట్లు సమాచారం.ఇవన్నీ పూర్తయిన తర్వాతనే పార్టీ ఏర్పాటుకు సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.