తెలంగాణలో సాగర్ ఎన్నికల హడావుడి ఎక్కువగా ఉంది.ప్రధాన పార్టీలన్నీ ఆ ఎన్నికలపైనే దృష్టిపెట్టాయి.
కాంగ్రెస్, బిజెపి, టిఆర్ఎస్ ఇలా అన్ని పార్టీల అగ్ర నేతలంతా ఈ నియోజకవర్గంలో తమ పార్టీని గెలిపించేందుకు ఫోకస్ పెంచారు.సరిగ్గా ఇదే సమయంలో తమ పార్టీని బలోపేతం చేసుకునేందుకు వైఎస్ షర్మిల శరవేగంగా అడుగులు వేస్తున్నారు.
జిల్లాల పర్యటనలు, సభలు, సమావేశాలు, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ తన పట్టు తెలంగాణలో పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.మరి కొద్ది రోజుల్లోనే పార్టీ పేరును ప్రకటించేందుకు ఏర్పాట్లు చేస్తున్న షర్మిల పార్టీ పేరును ప్రకటించిన తరువాత బలమైన నాయకులను పార్టీలో చేర్చుకుని , ప్రధాన పార్టీలకు గట్టిపోటీ ఇచ్చే విధంగా తన పార్టీని జనాల్లోకి తీసుకెళ్లాలని, పాదయాత్రలు, సమావేశాలు నిర్వహిస్తూ , తెలంగాణలో ప్రధాన పార్టీలకు దీటుగా తన పార్టీని నిలిచేలా చేయాలని షర్మిల వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
అయితే షర్మిల నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనం, పర్యటనలకు ఖమ్మం, నల్గొండ జిల్లాల నుంచి ఎక్కువగా రెస్పాన్స్ కనిపిస్తోంది.ఇక్కడే షర్మిల పార్టీ ప్రభావం ఎక్కువగా కనిపించేలా ఉంది.
మిగతా జిల్లాల్లో షర్మిల ప్రభావం అంతంతమాత్రంగానే ఉంటుంది అనే విధంగా పరిస్థితి కనిపిస్తోంది.ఎందుకంటే ఈ రెండు జిల్లాల్లో వచ్చిన రెస్పాన్స్ మిగతా జిల్లాల్లో కనిపించకపోవడం, షర్మిల కూడా ఎక్కువగా ఖమ్మం జిల్లా పైన ఫోకస్ పెట్టినట్టు గా కనిపించడం, పార్టీ పేరును ప్రకటించే సభాస్థలి కూడా ఏర్పాటు చేసుకోవడం, అది కాకుండా ఆమె ఖమ్మం జిల్లాలోని ఓ కీలక నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నట్లు లీక్ లు రావడం ,ఆమెకు కూడా అక్కడి నుంచి పోటీ చేసే ఉద్దేశం ఉన్నట్లుగా వ్యవహరిస్తుండడం వంటివి చోటు చేసుకుంటున్నాయి.
షర్మిల సోదరుడు జగన్ పార్టీ ప్రభావం ఖమ్మం జిల్లాలో 2014 ఎన్నికల సమయంలోనూ కనిపించడం, ఇప్పటికీ పెద్ద ఎత్తున వైఎస్ఆర్ అభిమానులు ఎక్కువగా ఉండటం వంటి కారణాలతో ఈ జిల్లాపై ఆమె స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తున్నారు.ఇక మిగతా జిల్లాల విషయానికి వస్తే పార్టీ ప్రభావం ఇక్కడ కనిపించకపోయినా, రెడ్డి సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న చోట షర్మిల ప్రభావం కనిపిస్తుందని, కాకపోతే ఎన్నికల సమయంలో షర్మిల పార్టీ ప్రభావం ప్రధాన పార్టీలకు తీరని నష్టాన్ని చేకూరుస్తాయనే లెక్కలు బయటకు వస్తున్నాయి.