అన్న బాటలో వెళితేనే అనుకున్న లక్ష్యాన్ని చేరు కోవచ్చు అని అభిప్రాయపడుతున్నారో ఏమో కానీ, తెలంగాణలో వైఎస్ షర్మిల వేస్తున్న రాజకీయ అడుగులు చూస్తుంటే, అన్న రూటు నే ఆమె ఎంచుకున్నట్టు కనిపిస్తోంది.వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన మొదట్లో జగన్ ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అయినా అవేమీ లెక్క చేయకుండా, ఒక వ్యూహం ప్రకారం జన బలం పెంచుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు.అధికారం సాధించాలనే తపన మాత్రమే కాకుండా, దానికి దగ్గరయ్యే రూటు ఏంటో జగన్ తెలుసుకోవడం తోనే, ప్రజలలో ఆయనకు ఈ స్థాయిలో ఆదరణ దక్కడంతో పాటు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబును, ఘనమైన రాజకీయ చరిత్ర ఉన్న తెలుగుదేశం పార్టీని ఈ స్థాయికి తీసుకురావడంలో జగన్ సక్సెస్ కావడానికి కారణం ఇదే.
ఇప్పుడు షర్మిల కూడా జగన్ చూపించిన బాటనే నమ్ముకున్నారు.ఆ రూట్లో వెళితేనే తెలంగాణలో అధికారం దక్కించుకోవచ్చు అని ఆమె నమ్ముతున్నారు.
ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్న షర్మిల తెలంగాణలో నిరుద్యోగ సమస్య విషయంలో ముందుగా పోరాడాలని నిర్ణయించుకున్నారు.ఉద్యోగాలు భర్తీ చేయకుండా, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం పై వైఎస్ షర్మిల ఈనెల 15వ తారీఖున మూడు రోజుల పాటు దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పటికే ఈ దీక్షకు అనుమతి కోరుతూ పోలీసులను షర్మిల కీలక అనుచరులు కలిశారు.ఈ రోజు సాయంత్రానికి అనుమతిపై పోలీసులు నిర్ణయం తీసుకుంటారు.అలాగే తాము చేపడుతున్న ఈ దీక్షకు తెలంగాణ జన సమితి నేత కోదండరామ్, గద్దర్, ఆర్.కృష్ణయ్య, తీన్మార్ మల్లన్న ఇలా అనేక మంది మద్దతు కావాలంటూ ఆమె ఇప్పటికే ఆహ్వానాలు పంపించారు.
ఇక షర్మిల చేపట్టిన దీక్షకు పెద్ద ఎత్తున నిరుద్యోగులను, విద్యార్థులను సమీకరించేందుకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు.అన్ని ఏర్పాట్లు పూర్తి అయినా, షర్మిల దీక్షలకు పోలీసులు అనుమతి వస్తుందా రాదా అనేది సందేహంగా మారింది.ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం తో దీక్షలు, ధర్నాలతో పోలీసులు పెద్దగా అనుమతి ఇవ్వడం లేదు.అయితే షర్మిల విషయంలో టిఆర్ఎస్ సానుకూలంగా ఉంటోందని, అసలు షర్మిల పార్టీ వెనుక కెసిఆర్ ఉన్నారనే ప్రచారం తెలంగాణలో సాగుతుండడంతో, షర్మిల సభకు ఆటంకాలు ఏవి ఏర్పడవనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి.